Hayathnagar: తాజాగా హయత్ నగర్ లో చోటు చేసుకున్న ఒక టీచర్,ఒక వ్యక్తి ఆత్మహత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఒక్కొక్క విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ములుగు జిల్లా పంచోత్కులపల్లికి చెందిన ఎల్లావులా పరుశురాములు, విజయ దంపతుల కుమారుడైన రాజేష్ అనే 25 ఏళ్ళ వ్యక్తి కుంట్లూర్ డాక్టర్స్ కాలనీలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. మొదట ఉపాధ్యాయురాలు తన వ్యక్తిగత ఫొటోలను రాజేష్ కు చరవాణిలో పంపినట్లు తెలుస్తోంది. ఆమెపై అమితమైన ప్రేమను పెంచుకున్న రాజేష్ ఆమె కోసం ఇంటిచుట్టూ తిరిగేవాడు.
దాంతో ఆమె కుటుంబాన్ని, రాజేష్ను వదులుకోలేని సందిగ్ధ పరిస్థితుల్లో ఆమె కూడా చనిపోవాలని నిర్ణయించుకుంది. ఇక గత నెల 24న చివరిసారిగా కుంట్లూర్ డాక్టర్స్ కాలనీలో రాజేష్, ఆమె కలుసుకున్నట్లు తెలిసింది. ఇకపై తాము కలిసి బతకలేమని, ఒకరినొకరు విడిచి ఉండలేమనీ భావించిన వారిద్దరూ కలిసే చనిపోవాలని నిర్ణయానికి వచ్చారు. అంతకుముందే హయత్ నగర్లోని ఒక ఫెర్టిలైజర్స్ దుకాణంలో గడ్డి మందును కొనుగోలు చేశారు. అక్కడే గడ్డి మందు తాగిన ఉపాధ్యాయురాలు ఇంటికెళ్లింది. అనంతరం రాజేష్ కూడా పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఉపాధ్యాయురాలు ఇంటికి చేరుకున్నాక వాంతులవడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ చికిత్స పొందుతూ మే 29న మృతిచెందింది. కుంట్లూర్ పరిధిలో రాజేష్ మృతదేహాన్నీ అదేరోజు స్థానికులు గుర్తించారు. దర్యాప్తులోభాగంగా.. రాజేష్, ఉపాధ్యాయురాలి ఫోన్ కాల్స్ తో పాటు సీసీటీవీ ఫుటేజ్లతో ఆధారాలు సేకరించారు. దర్యాప్తు తుదిదశకు చేర్చినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.