T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్లో సెమీఫైనల్స్ ఆశలే లేని స్థితి నుంచి పాకిస్తాన్ ఏకంగా ఫైనల్ ఆడే స్థాయికి చేరింది. టోర్నీ ప్రారంభంలో వరుసగా రెండు మ్యాచ్లు ఓడి తర్వాత పడుతూ లేస్తూ మూడు విజయాలు అందుకున్న ఆ జట్టు.. అనూహ్యంగా సెమీస్ రేసులోకి వచ్చింది. తీరా సౌతాఫ్రికా-నెదర్లాండ్స్ మ్యాచ్ లో.. డచ్ జట్టు సఫారీలకు షాకివ్వడంతో ఆఫ్రికన్ టీమ్ అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పాకిస్తాన్.. తాజాగా న్యూజిలాండ్ను కూడా ఓడించి టీ20 ప్రపంచకప్ ఫైనల్స్ లో అడుగుపెట్టింది.
సిడ్నీ వేదికగా ముగిసిన పాకిస్తాన్-న్యూజిలాండ్ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ దారుణంగా విఫలమైంది. ఆ జట్టు సారథి కేన్ విలియమ్సన్ (46), డారిల్ మిచెల్ (53 నాటౌట్) మినహా మిగిలినవారంతా విఫలమయ్యారు.
లక్ష్య ఛేదనలో పాకిస్తాన్.. 19.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు రిజ్వాన్ (57), బాబర్ ఆజమ్ (53) లు హాఫ్ సెంచరీలతో రాణించారు. మహ్మద్ హరీస్ (30) మెరుపులతో పాకిస్తాన్.. విజయాన్ని అందుకుంది.
After a disappointing start to the tournament, Pakistan have turned things around emphatically 👏#T20WorldCup #NZvPAK pic.twitter.com/ueP7WxLO6U
— Wisden (@WisdenCricket) November 9, 2022
ఈ విజయంతో పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్స్ కు చేరింది. 2007, 2009 తర్వాత పాకిస్తాన్.. ఫైనల్స్ కు చేరడం ఇది మూడోసారి. 13 ఏండ్ల తర్వాత పాకిస్తాన్ ఫైనల్స్ కు చేరడంతో ఆ జట్టు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 1992 వన్డే ప్రపంచకప్ గెలిచినట్టుగానే అదే ఆసీస్ గడ్డమీద పాకిస్తాన్.. ఈ టోర్నీని కైవసం చేసుకుంటుందని, చరిత్ర పునరావృతమవడం ఖాయమని భావిస్తున్నారు. మరి పాక్ చరిత్ర సృష్టించబోతుందా..? లేదా..? తెలియాలంటే ఈనెల 13 వరకు వేచి చూడాల్సిందే. గురువారం భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో పాకిస్తాన్ ఫైనల్స్ లో తలపడుతుంది.