Wheat Flour: ద్రవ్యోల్బణం కారణంగా పాకిస్తాన్ లో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ లోని కరాచీనగరంలో గోధుమపిండి ధర ఊహించని విధంగా భారీగా పెరిగింది. ఏకంగా కిలో గోధుమపిండి ధర 320 రూపాయలకు చేరింది. ప్రపంచంలోనే పాకిస్థాన్ దేశంలో గోధుమపిండి ధరలు అత్యంత ఖరీదైనవిగా మారాయని పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తెలిపింది. కరాచీతో పాటు పాక్ హైదరాబాద్, ఇస్లామాబాద్, రావల్పిండడి, సియాల్ కోట్, ఖుజ్దార్ లో గోధుమపిండి ధరలు గణనీయంగా పెరిగాయి.
పాకిస్థాన్ దేశంలోని ప్రధాన నగరాలతో పాటు బహవల్పూర్, ముల్తాన్, సుక్కూర్, క్వెట్టా పట్టణాల్లో గోధుమపిండి ధరలు అనూహ్యంగా పెరిగాయి. గోధుమపిండితో పాటు కిలో చక్కెర ధర 160 రూపాయలకు పెరిగింది. ఇప్పటికే పాకిస్థాన్ దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కేంద్రాల్లో గోధుమపిండి పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటల్లో పలువురు మరణించారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పాక్ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ప్రపంచంలోని మొదటి ఐదు అత్యల్ప నివాసయోగ్యమైన పట్టణాల్లో పాకిస్థాన్లోని కరాచీ కూడా స్థానం పొందిందని కనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ తెలిపింది. ప్రపంచంలోని లాగోస్, అల్జీర్స్, ట్రిపోలీ, డమాస్కస్ నగరాల కంటే కరాచీ 169 వ స్థానంలో నిలిచింది. పాకిస్తాన్లో పాటు మిగతా ప్రదేశాలలో కూడా రోజురోజుకీ నిత్యవసర సరుకుల ధరలు మండిపోతుండడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.