IPL: గత ఐపీఎల్లో పేలవ ప్రదర్శనను కనబర్చిన రోహిత్ శర్మ ఆధ్వర్యంలోని ముంబై ఇండియన్స్.. ఈ ఐపీఎల్లో కూడా అదే ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఈ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్ లోనే ముంబై ఓటమి పాలైంది. 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. గత ఐపీఎల్లో అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోవడంతో.. ఈ ఐపీఎల్లో బాగా రాణిస్తుందని ముంబై ఫ్యాన్స్ ఆశించారు. కానీ ఆదిలోనే ముంబై ఘోర పరాజయం పాలైంది.
ముంబై బ్యాటింగ్ బాగున్నప్పటికీ బౌలర్లలో ఎవరూ రాణించలేకపోతున్నారు. ఆదివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో భారీగా పరుగులు ఇచ్చారు. అమిత్ మిశ్రా మినహా మిగతా ఎవరూ బౌలింగ్ లో రాణించలేకపోయారు. దీంతో ముంబై టీమ్కు బుమ్రా లేని లోటు కనిపిస్తోంది. ఈ క్రమంలో దీనిపై రోహిత్ శర్మ స్పందించాడు. బౌలింగ్ లో బుమ్రా లోని లోటు కనిపిస్తోందని, మిగతా బౌలర్లు రాణించాలని హెచ్చరించాడు. బౌలర్లు రాణిస్తేనే గెలుపు సులువు అవుతుందని పేర్కొన్నాడు.
తమ జట్టు బౌలింగ్ లో రాణించలేకపోయిందనే విషయాన్ని రోహిత్ శర్మ ఒప్పుకున్నాడు. బౌలర్లు తమ సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నాడు. ఎవరో ఒకరు బౌలింగ్ లో బాధ్యత తీసుకుని ముందుకు రావాలని, బుమ్రా స్థానాన్ని భర్తీ చేయాలని చెప్పాడు. టీమ్ లో ఎంతోమంది మంచి టాలెంట్ కలిగిన బౌలర్లు ఉన్నారని, వారికి తాము మద్దతు ఇస్తామని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. గత 8 నెలలుగా బుమ్రా లేకుండానే తాను ఆడుతున్నానని, కానీ ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నాడు.
గాయాలు అనేవి మన నియంత్రణలో ఉండవని, దాని గురించి మనం ఏమీ చేయలేమని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అయితే గాయం కారణంగా ఈ ఐపీఎల్ కు బుమ్రా పూర్తిగా దూరం అయ్యాడు. ఇది ముంబై జట్టుకు బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఎన్నో ఏళ్లుగా ముంబై తరపున బుమ్రా ఆడుతున్నాడు. ముంబై జట్టులో కీలక బౌలర్ గా బుమ్రా ఉన్నాడు. ఇప్పుడు బుమ్రా లేకపోవడం ఆ జట్టుకు వెలితిగా కనిపిస్తోంది.