Huvina Hadagali: ఈ మధ్యకాలంలో ఆడవారి పరిస్థితి మరి దారుణంగా తయారయింది. ఇంటా బయట ఎక్కడ ఆడవారికి రక్షణ అన్నది లేకుండా పోతోంది. ఈమధ్య కాలంలో అయితే ఆడ పిల్లలకు భర్త వేధింపులతో పాటు అత్తింటి వేధింపులు ఎక్కువ అయ్యాయి. చాలామంది వివాహితలు వాటిని ఓపికగా భరిస్తుండగా మరికొందరు మాత్రం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ మధ్యకాలంలో వివాహితులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుని మరణిస్తుండగా అందులో సగానికి సగం పైగా వరకట్నపు వేధింపులే కారణంగా ఉంటున్నాయి.
తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని విజయనగర జిల్లా హూవిన హడగలికి చెందని బసమ్మ, అర్జున్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ వివాహం జరిగి 10 ఏళ్లు గడుస్తోంది. ఇద్దరూ హూవిన హడగలి లోని నేషనల్ కాలేజీలో టీచర్లుగా పని చేస్తున్నారు. అయితే ఆదివారం పరీక్ష విధుల కోసం బసమ్మ కాలేజీకి వచ్చింది. పరీక్ష అయిపోయిన తర్వాత క్లాసు రూములోకి వెళ్లి గడియపెట్టుకుంది. విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. క్లాస్ రూములోకి వెళ్లిన బసమ్మ ఎంత సేపటికి బయటకు రాకపోయే సరికి తోటి ఉపాధ్యాయులకు అనుమానం వచ్చి వెంటనే క్లాసు తలుపుల పగలగొట్టారు.
క్లాస్ రూమ్ లో బసమ్మ విగత జీవిగా కనిపించింది. వెంటనే తోటి ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికీ చేరుకున్న పోలీసులు బసమ్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం వైద్యశాలకు పంపించారు. బసమ్మ చనిపోయిన క్లాసురూములో పోలీసులకు ఓ సూసైడ్ నోట్ కనిపించింది. అందులో తన చావుకు గల కారణాలను బసమ్మ వివరించింది. భర్త, అత్త, ఆడపడచు వేధింపుల కారణంగా తాను చనిపోతున్నట్లు రాసింది. వరకట్న వేధింపులు తాళలేక తాను చనిపోతున్నట్లు రాసింది బసమ్మ. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.