Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని పేరు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా శ్రామిక వర్గాలకు పని లేకుండా రైతులను అన్ని విధాల మోసం చేశారని వివరించారు.
రాష్ట్రం కోసం ప్రజల కోసం మోడీ, బాబు, పవన్ కళ్యాణ్ కూటమిగా ఏర్పడ్డారని, వచ్చే ఐదేళ్లు ప్రగతి పధమేనని వ్యాఖ్యానించారు రాజ్యాంగాన్ని గాంధీ కుటుంబం తమకు అనుకూలంగా పలుమార్లు మార్చుకుందని, తాము మార్చాలనుకుంటే ఇప్పుడైనా మెజారిటీ ఉందని ఒక ప్రశ్నకు సమాధానం గా చెప్పారు పియూష్ గోయల్. విశాఖ రైల్వే జోన్ కోసం ఎన్నిసార్లు అడిగినా భూమి ఇవ్వకుండా ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇసుక, ల్యాండ్ లైన్, లిక్కర్ మాఫియా కు ఏపీ అడ్డగా మారిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోవడం వలనే గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు అన్నారు. నిజానికి ఏపీ అభివృద్ధికి ఎన్నో సహజ వనరులు ఉన్నాయి కానీ జగన్ ప్రభుత్వం అభివృద్ధి వైపు దృష్టి సారించలేదని విమర్శించారు. చాలా ప్రాజెక్టులో జగన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది, ఏపీలో డబల్ ఇంజిన్ సర్కార్ రావటం ఖాయం.
స్వంత ప్రయోజనాల కోసం జగన్ ఏపీని తాకట్టు పెట్టేసాడంటూ నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ పదేళ్లలో భారతదేశాన్ని ప్రపంచ దేశాలు గుర్తింపు తెచ్చేలా చేశారని అభివృద్ధి సంక్షేమం సమానంగా తీసుకెళ్లి ఆదర్శ పాలన అందించారని గోయల్ కొనియాడారు. పేదల కోసం పూర్తిగా ఉచిత బియ్యం అందించారు. ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల ఉచిత వైద్య సేవలు కల్పించారు, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం సాకారం చేశారు. జీవన్ మిషన్ ద్వారా మంచినీటి కొరత లేకుండా చేశారని గోయల్ వ్యాఖ్యానించారు.