Uppal Stadium Tickets: ఈ నెల 18న హైదరాబాద్లోని ఉప్పల్లో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి టిక్కెట్ల విక్రయాలను చేపట్టనున్నట్లు హెచ్సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ ప్రకటించాడు. అయితే గతంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ సందర్భంగా జింఖానా గ్రౌండ్స్ వద్ద జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈసారి టిక్కెట్లను ఆన్లైన్లో మాత్రమే విక్రయించనున్నట్లు అజారుద్దీన్ స్పష్టం చేశాడు.
అటు నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ వన్డే మ్యాచ్కు ఉప్పల్ స్టేడియం వేదిక అవుతుండటంతో క్రీడాభిమానులు స్టేడియంలోనే ఈ మ్యాచ్ చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆఫ్లైన్లో టికెట్లు ఇవ్వడం లేదని, ఆన్లైన్లోనే టిక్కెట్లను విక్రయిస్తామని హెచ్సీఏ అధికారులు స్పష్టం చేశారు. జనవరి 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు విడతల వారీగా టిక్కెట్ల విక్రయాలు ఉంటాయని తెలిపారు.
జనవరి 13న 6వేల టిక్కెట్లు, జనవరి 14న 7 వేల టిక్కెట్లు, జనవరి 15న 7 వేల టిక్కెట్లు, జనవరి 16న మిగతా టికెట్లను పేటీఎం ద్వారా విక్రయించడం జరుగుతుందని హెచ్సీఏ అధికారులు వెల్లడించారు. మొత్తం స్టేడియం కెపాసిటీ 39,112 కాగా.. 29,417 టికెట్లు అమ్మకానికి పెట్టామని, మిగిలిన 9,695 టిక్కెట్లు కాంప్లిమెంటరీ అని వివరణ ఇచ్చారు. అయితే మ్యాచ్ రోజు మాత్రం అభిమానులు ఆన్లైన్ టిక్కెట్ కాకుండా ఫిజికల్ టిక్కెట్ చూపించాల్సి ఉంటుందన్నారు.
ఫిజికల్ టిక్కెట్ ఎలా తీసుకోవాలి?
పేటీఎం ద్వారా ఆన్లైన్ టిక్కెట్ కొనుగోలు చేసిన వారు ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో జనవరి 15 నుండి 18 వరకు.. ఉదయం 10 నుండి 3 గంటల వరకు ఫిజికల్ టికెట్ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో టికెట్ తీసుకునేవారు కేవలం గరిష్టంగా 4 టికెట్స్ మాత్రమే తీసుకోవాలని హెచ్సీఏ అధికారులు సూచించారు. బ్లాక్ టికెట్ అమ్మకాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అటు మ్యాచ్ జరిగే రోజు పార్కింగ్ ఇబ్బందులు కూడా లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.