Vallabhaneni Vamsi: వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటినుంచే ఎన్నికలకు సంబంధించిన వేడి మొదలైంది. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఖరారయ్యేట్టు కనిపిస్తోంది. మరొకవైపు వైసీపీ మాత్రం సోలో ఫైట్ చేసే ఆలోచనలో ఉంది. అయితే ఇన్నాళ్లు బీజేపీని ఒక్క మాట కూడా అనని వైసీపీ నేతలు ఒక్కసారిగా బీజేపీ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
తాజాగా వల్లభనేని వంశీ ఈ పొత్తులపై మాట్లాడుతూ.. సినిమాల్లో విలన్లు ఎంతో మంది ఉంటారని, హీరో మాత్రం ఒక్కడే ఉంటాడని, ముఖ్యమంత్రి జగన్ కూడా అంతే అంటూ భారీగా సినిమా డైలాగులు వేశారు. జగన్ ఒంటరిగానే యుద్ధం చేస్తారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు కాటికి కాళ్ళు చాచే వయసులో ఉన్నారు. గన్నవరం నియోజకవర్గంలో 27 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే ఎక్కువ శాతం ఇళ్లు నిర్మించుకొని గృహ ప్రవేశం కూడా చేశారు. అద్దె ఇంట్లో ఉంటూ అనేక ఇబ్బందులు పడుతున్న 30 లక్షల మంది పేదలకు జగన్ ఆత్మగౌరవాన్ని ఇచ్చారు అంటూ వల్లభనేని వంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
అయితే అంతకుముందు మంత్రి అంబటి రాంబాబు సైతం చంద్రబాబుపై మండిపడ్డారు. పోలవరం పనుల పురోగతిపై ఈనాడు దుష్ప్రచారం చేస్తోందన్నారు. పోలవరం పురోగతి ఆగిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణంలో చంద్రబాబు అనేక తప్పిదాలు చేశారని మంత్రి ఆరోపించారు.