Nagarkurnool: దేశం అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది. టెక్నాలజీని రోజుకురోజుకు మనం వాడుకుంటూ ముందుకు సాగుతున్నాం. అంతరిక్షంలోకి రాకెట్లను ఎంతో సులభంగా పంపగలుగుతున్నాం. ఇలాంటి మారుతున్న కాలంలోనూ చాలామంది అంధకారంలోనే ఉంటున్నారు. వారికి కులం, మతం, ప్రాంతం లాంటి ముసుగు వల్ల ప్రపంచంలో ఏం జరుగుతుందనే విషయం అర్థం కావడం లేదు.
దేశంలో ఓ వైపు మార్పు జరుగుతుంటే కొంతమంది మాత్రం కట్టుబాట్లకు, మూఢనమ్మకాలకు విలువ ఇస్తున్నారు. నిజానికి అంధవిశ్వాసాల వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇలాంటి వారి వల్ల సమాజంలో మార్పు అనేది సాధ్యం కావడం లేదు.
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గుడిలోకి ఒక దళిత మహిళ ప్రవేశించిందని, గ్రామస్తులు ఆ గుడికి తాళం వేశారు. దళిత మహిళ వెళ్లిన గుడిలోకి తాము ఎలా వెళతామంటూ కొంతమంది వితండ వాదానికి దిగారు. దళితుల పట్ల ఇంకా కొనసాగుతున్న వివక్షకు ఇది సజీవ సాక్షం.
నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం చాకలి గుడిసెల గ్రామంలో రామాలయం ఉంది. సోమవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన వింజమూరి బాలామణి అనే దళిత మహిళ గుడిలోకి వెళ్లింది. దళితురాలైన మహిళ రామాలయంలోకి ఎలా వెళుతుందంటూ గ్రామస్తులు రాద్ధాంతం చేశారు. ఆమె గుడిలో నుండి బయటకు వచ్చిన తర్వాత దళితురాలు వెళ్లిన గుడిలోకి మేం వెళ్లమంటూ గుడికి తాళం వేశారు. కాగా దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, విచారణ చేపట్టారు.