Virat Kohli: పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్లో అత్యద్భుత ఫామ్లో అదరగొడుతున్నాడు. ఇప్పుడంటే అందరూ కోహ్లీని ఆకాశానికెత్తేస్తున్నారు కానీ కొద్దిరోజుల ముందుకు వెళ్తే అసలు అతడిని జట్టులో ఉంచడమే దండుగ అన్నవాళ్లూ ఉన్నారు. కోహ్లీ శకం ముగిసిందని.. ఇక అతడిని పక్కనబెట్టి యువ ఆటగాళ్లకు అవకాశమిస్తే బెటరనే వాదనలూ వినిపించాయి. కోహ్లీ మూడేండ్లుగా సెంచరీ చేయలేక తంటాలు పడ్డాడు. సెంచరీ సంగతి దేవుడెరుగు..? కనీసం 30, 40 పరుగులు చేస్తే అదే పదివేలు అనే దుస్థితి ఎదురైంది. వరుసగా మ్యాచ్లలో వైఫల్యాలు, ఐపీఎల్లో అట్టర్ ఫ్లాఫ్ తో జట్టు కోహ్లీ చోటు ప్రశ్నార్థకమైంది.
ఆ సమయంలో చాలా మంది మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, విమర్శకులు కోహ్లీ ఆటతీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక కోహ్లీ రిటైరైతే బెటర్ అని.. కోహ్లీలో మునపటి ఆట లేదని.. అతడు టీ20లకు పనికిరాడని విమర్శలు వెల్లువెత్తాయి. కోహ్లీకి సలహాలు, సూచనలు, విమర్శలతో విసుగెత్తింది.
అయితే ముప్పేట దాడి సాగుతున్నా కోహ్లీకి మహేంద్ర సింగ్ ధోని మాత్రం ధైర్యం చెప్పాడట. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న కోహ్లీకి ధోని చెప్పిన మాటలు టానిక్ లా పనిచేశాయట. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. ఆర్సీబీ తాజాగా విడుదల చేసిన పోడ్కాస్ట్ లో కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కోహ్లీ మాట్లాడుతూ.. ‘ఆ సమయంలో నాకు జెన్యూన్ గా సపోర్ట్ చేసింది ధోని. నాకు ధోనితో బలమైన బంధం ఉంది. అది ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువగా పరస్పర గౌరవం అని నేను చెప్పగలను. నేను ఫామ్ కోల్పోయినప్పుడు ధోని నాకు ఒక మెసేజ్ చేశాడు. అందులో.. ‘నువ్వు ఎప్పుడైతే స్ట్రాంగ్ గా అవ్వాలనుకుంటున్నావో అంత బలంగా కనిపించాలి. ప్రజలు మీరు ఎలా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారని అడగడం మరిచిపోతారు..’ అని అందులో పేర్కొన్నాడు. అది నాకు బలంగా తాకింది. ఇదే కదా నేను కోరుకునేది. నేనెప్పుడూ నమ్మకం కలిగిన వ్యక్తులను, మానసికంగా బలంగా ఉన్న వ్యక్తులతో కలవడానికి ఇష్టపడతాను. వాళ్ల దగ్గర మనం చాలా నేర్చుకోవచ్చు..’ అని తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
“The only person who genuinely reached out to me is MS Dhoni. I’m blessed to have such a strong bond with him”
Virat Kohli on RCB podcast pic.twitter.com/gSoDrxzjWn— 𝖆𝖓𝖚𝖕 (@anupr3) November 6, 2022