Unadkat: భారత్-బంగ్లాదేశ్ మధ్య బుధవారం నుంచి రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్లో బంగ్లాదేశ్ను తక్కువ అంచనా వేసిన టీమిండియా చావుదెబ్బ తినాల్సి వచ్చింది. పసికూన అనుకుంటే బెబ్బులిలా రెచ్చిపోయి ఆడిన బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో టెస్ట్ సిరీస్ గెలిచి ఎలాగైనా లెక్క సరిచేయాలని భారత్ భావిస్తోంది. గాయాల బెడద టీమిండియాను ఎలా ముందుకు తీసుకువెళ్తుందో ఆసక్తికరంగా మారింది.
చేతి వేలి గాయంతో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరంగా ఉండటంతో కేఎల్ రాహుల్ పగ్గాలను స్వీకరించనున్నాడు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్తో కలిసి శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ తర్వాతి స్థానాలను భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ రాహుల్ తాను మిడిలార్డర్లో ఆడాలని భావిస్తే అభిమన్యు ఈశ్వరన్కు తుది జట్టులో ఛాన్స్ లభించనుంది.
కేఎల్ రాహుల్ మిడిలార్డర్కు వెళ్తే అద్భుత ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ రిజర్వు బెంచ్కు పరిమితం కావాల్సి వస్తుంది. అందువల్ల ఈ సాహసాన్ని రాహుల్ చేయకపోవచ్చు. అటు వికెట్ కీపర్గా పంత్ లేదా కేఎస్ భరత్ తుది జట్టులో ఉంటారు. దూకుడే తమ మంత్రం అని రాహుల్ ప్రకటించిన నేపథ్యంలో పంత్కే అవకాశం లభించవచ్చు. ఇద్దరు స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ ఆడనున్నారు.
ఉనద్కట్కు చోటు లభించేనా?
దేశవాళీ టోర్నీలలో దుమ్మురేపడంతో 12 ఏళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన జయదేవ్ ఉనద్కట్ తుది జట్టులో చోటు దక్కించుకుంటాడో లేదో అన్న విషయం ఆసక్తికరంగా మారింది. పేసర్లుగా మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ ఆడటం ఖాయం కాగా.. మూడో పేసర్గా జయదేవ్ ఉనద్కట్, శార్దూల్ ఠాకూర్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరికీ బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండంతో కేఎల్ రాహుల్ ఎవరి వైపు మొగ్గు చూపుతాడో చూడాలి.