Mega DSC: ఎన్నికల సమీపిస్తున్న వేళా నిరుద్యోగ అభ్యర్థుల్ని మరొకసారి మోసం చేయడానికి సీఎం జగన్ ప్లాన్ వేశారు. అధికారంలోకి రాగానే మెగా డిఎస్పీ నిర్వహిస్తాను అంటూ 2019 ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్, ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆ ఊసు కూడా ఎత్తలేదు. కానీ ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమయం ఆసన్నమవుతుండడంతో డీఎస్సీ అంటూ తెగ హడావిడి చేస్తున్నారు. నిరుద్యోగుల ఓట్ల కోసం డీఎస్సీ అని మళ్ళీ సరికొత్త నాటకాన్ని మొదలు పెడుతున్నారు. సరిగ్గా ఎన్నికల ముందే జగన్కు డీఎస్సీ గుర్తుకురావడం గమనార్హం. నిరుద్యోగ అభ్యర్థులు ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోని సీఎం ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చేందుకు నెల సమయం ఉందనగా నియామకాలు చేపడతామంటూ హడావుడి చేస్తున్నారు.
గత ఎడాది జులై ఆగస్టులో డీఎస్సీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామంటూ ప్రకటనలు చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ ఆ తర్వాత దాని ఊసు మాట్లాడలేదు. నాలుగైదు రోజులుగా డీఎస్సీ ప్రకటనంటూ నిరుద్యోగుల్ని ఆకట్టుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 మధ్య రెండు డీఎస్సీల్ని నిర్వహించారు. డీఎస్సీ-2014లో 10,313 పోస్టులు భర్తీ చేయగా డీఎస్సీ-2018లో 7,902 పోస్టులకు ప్రకటన ఇచ్చి, ఎంపిక ప్రక్రియను చేపట్టగా.. కోర్టు కేసుల కారణంగా పెండింగ్లో పడింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ఈ పెండింగ్ పోస్టుల్ని భర్తీ చేసింది. మెగా డీఎస్సీ అంటూ ప్రతిపక్ష నేతగా ఊదరగొట్టిన జగన్ ఇప్పుడు పోస్టుల్ని తగ్గించేస్తున్నారు. ఆరు వేల పోస్టుల్నే భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. వీటికీ ఆర్థికశాఖ నుంచి అనుమతి లభించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎంపీపీ, జడ్పీ, పురపాలక పాఠశాలల్లో 18,520 ఖాళీలు ఉన్నట్లు శాసనమండలిలో మంత్రి బొత్స ప్రకటించారు. అన్ని పోస్టులూ కలిపి 1,88,162 ఉంటే పని చేస్తున్నవారు 1,69,642 మంది ఉన్నారు. ఇవికాకుండా ఆదర్శ పాఠశాలలు, సాంఘిక సంక్షేమం, బీసీ, గిరిజన సంక్షేమ గురుకులాలు, ఏపీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లోనూ భారీగా ఖాళీలున్నాయి. ఇవన్నీ కలిపితే 28 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ భర్తీ చేయకుండా 6 వేల పోస్టులతో సరిపెట్టేందుకు జగన్ సిద్ధమయ్యారు.
తెదేపా అధికారంలో ఉన్న సమయంలో 23 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రతిపక్ష నేతగా జగనే ప్రకటించారు. 7,902 పోస్టులకే డీఎస్సీ ఇచ్చారంటూ నాడు ప్రచారం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఈ ఖాళీలన్నీ ఏమైపోయాయి? ఇంకా పెరగాలి కదా? అప్పట్లో జగన్ చెప్పిన లెక్కల ప్రకారం చూసినా 15 వేల టీచర్ పోస్టుల ఖాళీలు ఉండాలి. ఇవి కాకుండా జనవరి నుంచి పదవీ విరమణలు మొదలు కానున్నాయి. జగన్ సర్కార్ ఇప్పుడు డీఎస్సీని ప్రకటించినా వచ్చే ప్రభుత్వంలోనే పరీక్ష నిర్వహణ సాధ్యమవుతుంది. డీఎస్సీ ప్రకటనకు పరీక్ష నిర్వహణకు మధ్య 40 రోజుల సమయం ఇవ్వాలి. ఇప్పుడు డీఎస్సీ ప్రకటించినా దరఖాస్తుల స్వీకరణ ముగిసే సమయానికే ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది. ఫలితంగా నియామక పరీక్ష వాయిదా పడే అవకాశం ఉంది. నాలుగున్నరేళ్లు డీఎస్సీ మాటే ఎత్తకుండా ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్కు నెల ముందు ప్రకటన ఇవ్వడమంటే నిరుద్యోగుల్ని మోసగించడమేనని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.