Kesineni Nani: దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించి జాతికి అంకితం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. విజయవాడ స్వరాజ్ మైదానంలో 18.18 ఎకరాల విశాల ప్రాంగణంలో ఈ విగ్రహన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 404.35 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ విగ్రహం కోసం ఖర్చు చేసింది. అయితే ఈ కార్యక్రమంలో కేశినేని నాని కి సరియైన గౌరవం దక్కలేదని, అయినా ఏదో ఊహించి వైసీపీలో అడుగు పెడితే ఇలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఊహించి ఉండరు అంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
విజయవాడ ఎంపీ కేసినేని నాని వ్యక్తిత్వం ఉన్న కొద్దిమందిలో ఒక నాయకుడు అన్న భావన మొన్న మొన్నటి వరకు అందరికీ ఉండేది. కానీ తెలుగుదేశం నుంచి వైసీపీ లోకి మారిన తర్వాత ఆయన పట్ల ఉన్న గౌరవభావం అందరిలోనూ మటుమాయం అయింది. అహం భావం, పొగరుబోతు తనం తప్ప ఆయనలో ఆలోచన లేదని వైసీపీలో చేరిన తరువాత ఆయన అత్యంత అప్రాధాన్యంగా ఆ పార్టీలో మెలుగుతున్న తీరుతో అందరికీ అవగతం అయింది.
తెదేపాలో ఉండగా తనకు తాను చంద్రబాబుతో సమాన స్థాయి ఉన్న నేతగా భావించుకునేవారు ఆ కారణంతోనే పార్టీలో సీనియర్లు చాలామంది ఆయనకు దూరంగా మెలిగేవారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు విజయవాడలో పార్టీ పరంగా ఏ కార్యక్రమం జరిగిన ఎంపీ హోదాలో ఉన్న నానికి సముచిత ప్రాధాన్యం లభించేది. వేదికపై ఎన్టీఆర్ పక్కనే స్థానం కూడా లభించేది.
అయితే ఇప్పుడు నానికి వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యత లభించడం లేదని ఆయన ఇప్పటికైనా గ్రహించి ఉంటారు. ఎందుకంటే విజయవాడలో జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీగా ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా వైసీపీ నానిని ఘోరంగా అవమానించింది. దీంతో వైసీపీలో నేతలకు ఇచ్చే విలువ ఇంతే అని తెలిసినా కూడా నాని అణిగి ఉండడానికి సిద్ధమై ఉన్నట్లు కనిపిస్తున్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.