Chikballapur: ఇటీవల కాలంలో చాలామంది వివాహేతర సంబదాల మోజులో పడి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చురేపుతున్నాయి. ఎన్నో ఆశలతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన దంపతులు వివిధ కారణాలతో గొడవపడి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. భార్యాభర్తలు వివాహేతర సంబంధాల మోజులో పడి పిల్లల భవిష్యత్తులను నాశనం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ వివాహేతర సంబంధాల కోసం ఒకరినొకరు చంపుకోవడం వరకు వెళుతున్నారు.
కొందరు కక్షలు పెంచుకుని హత్యలు చేయడానికి కూడా వెనకాడడం లేదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలో ఒక భర్త, అక్రమ సంబంధం పెట్టుకున్న తన భార్య ప్రియుడిని నిర్మానుష్య ప్రాంతానికి రప్పించి అతడి పై దాడిచేశాడు. గొంతు కోసి రక్తం తాగాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రంలోని బట్లహళ్లి ప్రాంతానికి చెందిన విజయ్, మాలకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో విజయ్ భార్య మోడెం పల్లికి చెందిన మారేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
ఇక వీరిద్దరి వివాహేతర సంబంధం గురించి ఊరంతా కోడై కూస్తుంది. ఇక ఆ విషయం కాస్త భర్త విజయ్ కు తెలియడంతో కోపంతో రగిలిపోయాడు. ఎలాగైనా మారేష్ ను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా మారేష్ ను చింతామణి తాలూకా సిద్దేపల్లి క్రాస్ వద్దకు రప్పించాడు. అక్కడికి చేరుకోగానే విజయ్ మారేష్ పై దాడి చేసి గొంతు కోసి రక్తం తాగాడు. ఈ తతంగాన్ని అంతా తన ఫోన్ లో వీడియో రికార్డ్ చేశాడు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయాడు విజయ్. అటుగా వెళ్తున్న కొందరు గాయపడిన మారేష్ ను గమనించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మారేష్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విజయ్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.