Shanmukha Strategy: తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వివిధ అంశాలపై దాదాపుగా మూడున్నర గంటల పాటు చర్చించారు. సంక్రాంతి సందర్భంగా పవన్ను విందుకు ఆహ్వానించారు చంద్రబాబు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. టీడీపీ సూపర్ సిక్స్, జనసేన షణ్ముఖ వ్యూహం కలిపి మేనిఫెస్టోను రూపొందించనున్నట్లు సమాచారం.
ఈ నెలలోనే చంద్రబాబు, పవన్ కలిసి పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన రా.. కదలిరా బహిరంగ సభలో మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేవలం మేనిఫెస్టో గురించి మాత్రమే కాకుండా త్వరలో రాబోతున్న ఎన్నికల్లో ఇరు పార్టీలకు సంబంధించి సీట్ల సర్దుబాటు విషయంపైనా చర్చించారు. ఇతర పార్టీల నుంచి పలువురు కీలక నేతలు రెండు పార్టీల్లో చేరుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు టీడీపీ, జనసేన కూటమి వైపు అడుగులు వేస్తున్నారు. దీంతో పాత నేతలకు ఇబ్బంది లేకుండా కొత్త నేతలకు తగు ప్రాధాన్యం ఇచ్చేలా ఎలా వ్యవహరించాలా అనే దానిపై రెండు పార్టీల నేతలు చర్చించారు.
టీడీపీ, జనసేన కలిసి పండుగ తర్వాత తొలి జాబితా విడుదల చేయాలని నిర్ణయించారు. మరికొన్ని బహిరంగ సభల్లో చంద్రబాబు, పవన్ పాల్గొనాలని డిసైడ్ అయ్యారు. ఉమ్మడి ప్రచార సభలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాల గురించి కూడా చర్చ జరిగింది. మరోవైపు బీజేపీతో పొత్తు అంశంపైనా ఇరు పార్టీల నేతల సమావేశంలో చర్చ జరిగింది. ఇటీవల బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయిన నాదెండ్ల మనోహర్ ఆ విషయాలను ఈ సమావేశంలో వివరించినట్లు తెలిసింది. ఇలా షణ్ముఖ వ్యూహం పేరుతో మ్యానిఫెస్టోని ప్రిపేర్ చేసినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన గెలుపు ఖాయం అన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.