Veerraju: త్వరలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలలో బీజేపీ అధ్యక్షులను మార్చబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి, ఏపీలో సోమూ వీర్రాజు స్థానంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ పగ్గాలు చేపడతారని తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డిని కూడా తెచ్చుకొన్నారు కనుక ఆయన పేరు కూడా వినబడుతోంది. అలాగే ఈ విషయంలో దగ్గుబాటి పురందేశ్వరి పేరు కూడా వినిపిస్తోంది. కానీ ఆమెకు పార్టీ పగ్గాలు ఇచ్చే ఆలోచన ఉంటే మూడేళ్ళ క్రితమే ఇచ్చి ఉండేవారు కదా?కనుక ఆమెకు అవకాశం ఉండకపోవచ్చు.
అయితే త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ అధ్యక్షుల మార్పు మాత్రం కచ్చితం అని తెలుస్తోంది. అయితే జాతీయ స్థాయిలో బిజేపీ భవిష్యత్ రాజకీయ అవసరాలు, ప్రయోజనాలను లెక్కకట్టుకొనే ఏపీలో బీజేపీ అనే పావును కదుపుతుంది తప్ప ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాలనో లేదా వైసీపీని ఢీకొని ప్రత్యామ్నాయంగా ఎదగాలని కాదని మాత్రం చెప్పవచ్చు. కనుక బీజేపీ అధిష్టానం ఈ ఆలోచనలో మార్పురానప్పుడు ఏపీ బీజేపీకి ఎవరిని అధ్యక్షుడుగా నియమించినా పెద్ద తేడా ఏమీ ఉండదనే భావించవచ్చు.
అయితే సోమూ వీర్రాజు జనసేనతో కలిసి పనిచేయడానికి ఇష్టపడటం లేదు కనుక ఆయన స్థానంలో సత్యకుమార్ యాదవ్ పగ్గాలు చేపడితే, రెండు పార్టీల మద్య సఖ్యత ఏర్పడి కలిసి పనిచేసేందుకు మార్గం సుగమం కావచ్చు. ఒకవేళ టిడిపిని కలుపుకోవాలన్నా సత్యకుమార్ యాదవ్ ఉంటేనే సాధ్యం అవుతుందనేది అందరికీ తెలిసిందే. అలాకాక సోమూ వీర్రాజునే కొనసాగిస్తే, ఎప్పటిలాగే మూడడుగులు ముందుకి, నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లు ఏపీ బీజేపీ సాగవచ్చు.