YCP MLA Dwarampudi Chandrasekhar:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు మంచి చేయాలి అంటూ సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఎప్పుడూ ఆ పార్టీ ఎదుగుదల కోసం పని చేసింది లేదు. ఎంతసేపు టీడీపీ,వైసీపీ అంటూ జపం చేయడం తప్పితే జనసేన పార్టీ గురించి పెద్దగా పట్టించుకునింది లేదు. అలాగే ఎన్నికలప్పుడు వైసీపీ మినహా ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని, ఏదో అలా అయ్యిందనిపిస్తూ వచ్చారు. సొంతంగా ఏపీలో అధికారంలోకి వచ్చేంత సీన్ లేదదు అని ఆయన మొదట్లోనే గ్రహించారు. దీంతో మొట్ట మొదట టీడీపీ బీజేపీ కూటమి పల్లకీని ఆయన మోశారు.
ఆ తర్వాత ప్రభుత్వంతో ఆయన విభేదించారు. వామపక్షాలు, బీఎస్పీలతో పొత్తు కుదుర్చుకుని ఎన్నికల బరిలో నిలిచారు. కానీ ఆయన టీడీపీ సానుకూల పంథాను అనుసరించారు. టీడీపీ ఇచ్చే ప్యాకేజీకి తలొగ్గి తమకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ తీవ్ర విమర్శలు చేయసాగింది. ఇటీవల టీడీపీతో అధికారికంగా పొత్తు కుదుర్చుకోవడంతో వైసీపీ విమర్శలకు బలం కలిగించినట్టైంది. ప్యాకేజీ అనే ఆరోపణలు ఎదుర్కోవడం పవన్కు కష్టంగా వుంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
తనకు తెలిసి రూ.1400 కోట్ల ప్యాకేజీ సొమ్ము హవాలా ద్వారా దేశ సరిహద్దులు దాటిందని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఇంత పెద్ద మొత్తంలో ప్యాకేజీ సొమ్ము దుబాయ్, రష్యా, సింగపూర్ దేశాల్లో ఎక్కడికి వెళ్లిందో తేలాలని ఆయన డిమాండ్ చేశారు. పవన్ ప్యాకేజీ సొమ్ము విదేశాలకు వెళ్లిందనేది నిజమని, ఆ విషయం బయటకు రావడం ఖాయమని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ను కచ్చితంగా తాను ప్యాకేజీ కల్యాణ్ అంటానని ఆయన స్పష్టం చేశారు.