AP Govt: అమరావతిలో పలు నిర్మాణాలు పూర్తి చేశామని ఏపీ ప్రభుత్వం బ్యాంకులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో పాటు.. అధికారులు ఉండడానికి ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. దానికోసం రూ.2,560 కోట్ల అంచనాతో హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించింది. యూబీఐ లీడ్ బ్యాంకుగా ఉన్న కన్సార్షియం రూ.2,060 కోట్లు మంజూరు చేయగా అందులో రూ.1,950 కోట్లు సీఆర్డీఏకు విడుదలయ్యాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారెంటీ కూడా ఇచ్చింది. టీడీపీ హయాంలో 70శాతానికి పైగా నిర్మాణాలు పూర్తి అయ్యాయి. ఇంతలోనే ప్రభుత్వం మారింది. అమరావతి ఆనవాళ్లు లేకుండా చేయాలని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకే అమరావతి అనే మాట ఎత్తడానికి ఇష్టపడలేదు. కానీ, అక్కడ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశామని బ్యాంకులకు లేఖలు రాశారు. వాటిని నమ్మించడానికి ఫేక్ ప్రూఫ్స్ కూడా సిద్దం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు అద్దె కూడా కడుతున్నామని నమ్మించడానికి సీఆర్డీఏ అకౌంట్లో రూ. 63 కోట్లు జమచేసి దాని రిసిప్ట్ బ్యాంకులకు చూపించారు.
అమరావతి హౌసింగ్ ప్రాజెక్టులకు తీసుకున్న రుణ నిబంధనల ప్రకారం వాటిని పూర్తి చేయాలి. లేదంటే, రెండు వేల కోట్లు చెల్లించాలి. అలా చెల్లించకపోతే ఎన్పీఏలు పడతాయి. అదే జరిగితే ప్రభుత్వం దివాళ తీసినట్టే. దివాళ తీసినట్టు బయటకు తెలిస్తే ఇంకా అప్పులు పుట్టడం కష్టం అవుతుంది. అలా అని రూ. 2 వేల కోట్లు ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుందా? అంటే అది జరిగే పని కాదు. కావాల్సిన కాంట్రాక్టుర్లకో లేకపోతే మరో పనికో వాడుకుంటారు కానీ.. బ్యాంకులకు ఎందుకు ఇస్తారు. అసలు ఎన్నికల సమయం కనుక ఖర్చులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి సింపుల్గా సీఆర్డీఏ అకౌంట్లో డబ్బులు వేసి ఆ రిసిప్ట్తో బ్యాంకులను మోసం చేశారు. లక్ష, రెండు లక్షల రూపాయల లోన్ కోసం నానా యాగీ చేసే బ్యాంకులు జగన్ సర్కార్ ఇచ్చిన రిసిప్టును చూసి నమ్మేశాయి. ఈ తతంగంపై ఆర్బీఐకి ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. సంబంధిత బ్యాంకర్లపై చర్యలు తప్పవు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు, సీఆర్డీఏ- జీఏడీ మధ్య ఒప్పందం కూడా చట్టపరంగా నిలవవు.