YSRCP: నా మాటే శాసనం అన్నట్టు వైసీపీ అధినేత జగన్ వ్యవహారిస్తూ ఉంటారు. ఆ వ్యవహార శైలితోనే ఇప్పుడు పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పుడు వరకూ ఏడు విడతలుగా సుమారు 70 మంది అభ్యర్థులను ప్రకటించారు. కానీ.. అందులో ఎంత మంది బీఫాంలు తీసుకుంటారో తెలియదు. ఇటీవల వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనం. ఇప్పుడు నియోజకవర్గాల ఇంఛార్జులను మాత్రమే నియమించామని ఆయన చెప్పారు. వారంతా ఎమ్మెల్యే అభ్యర్థులు కావాల్సిన అవసరం లేదని అన్నారు. దీంతో.. నామిషన్ల టైం వచ్చేసరికి ఎంతమంది ఉంటారో చెప్పలేదని పరిస్థితి ఏర్పడింది.
జగన్ ఏకపక్ష నిర్ణయాలే ఈ పరిస్థితులకు దారి తీసుస్తున్నాయని వైసీపీలో చర్చ జరుగుతోంది. సర్వేలనే నమ్ముకొని.. ఆయన నచ్చిన వ్యక్తులను నచ్చిన స్థానాల్లో ఇంఛార్జులుగా ప్రకటించారు. గెలిచే అవకాశం లేనివారిని నిర్మొహమాటంగా పక్కన పెడుతున్నామని చెప్పారు. అయితే, ఆయనకు అందిన సర్వేలు ఎంత వరకు జెన్యూన్ గా ఉన్నాయో తెలియదు. కానీ.. నర్సారావుపేట లావు శ్రీకృష్ణ దేవరాయలకు ఎంపీ టికెట్ నిరాకరించారు. దీంతో.. ఆయన వైసీపీని వీడారు. ఆయనకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. ఆ లోక్సభ ఎంపీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలంతా చెప్పినా జగన్ వినలేదు. ఆయన మాట ఆయనదే అన్నట్టు వ్యవహరించారు. ఇదో ఉదాహరణగా చెప్పుకుంటే.. దాదాపు అన్ని నియోజకవర్గాల పరిస్థితి అలాగే ఉంది. దీంతో.. పార్టీలో అసంతృప్త నేతలు పెరిగిపోయారు. టికెట్ రాని వాళ్లు టికెట్ రాలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తే.. టికెట్ వచ్చిన వాళ్లు గెలిచే అవకాశం లేని స్థానంలో పోటీ చేయమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారమంతా జగన్ దగ్గరకు వెళ్లింది. దీంతో.. అభ్యర్థుల విషయంలో ఆయన మరోసారి ఆలోచిస్తున్నారు. అంతేకాదు.. చాలా చోట్ల అభ్యర్థుల మార్పునకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ.. పరిస్థితులు మాత్రం అందుకు అనుకూలంగా లేవు.
అవనిగడ్డ ఇంచార్జ్గా ప్రముఖ వైద్య నిపుణుడు సింహాద్రి చంద్రశేఖర్ను ప్రకటించారు. కానీ, ఆయన ఆసక్తిగా లేకపోవడంతో.. ఆయన కుమాడురు రామ్చరణ్ను బరిలో దించాలని ఆయన చూస్తున్నారు. కానీ.. జగన్ మరో దారి చూస్తున్నారు. మాజీ సభాపతి, టీడీపీ నేతల మండలి బుద్ధప్రసాద్తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. పోటీకి సై అంటే వెంటనే పేరును ప్రకటిస్తామని వైసీపీ తరుఫున కొందరు నేతలు బుద్ధప్రసాద్కు చెప్పారని తెలుస్తోంది. అయితే, ఆయన మాత్రం అవును అని కానీ.. కాదు అని కానీ చెప్పలేదని తెలుస్తోంది.
ఇక మచిలీపట్నం ఎంపీ నియోజకవర్గంపై కూడా ఇలాంటి సస్పెన్స్ నడుస్తోంది. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేరును మచిలీపట్నం ఎంపీ నియోజకవర్గం ఇంఛార్జీగా ప్రకటించారు. అయితే, ఇప్పుడు మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. బాడిగ 2004లో కాంగ్రెస్ తరఫున మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసిన గెలిచారు. కానీ, 2009లో మాత్రం ఓడిపోయారు. అందుకే వైసీపీ అధిష్టానం చూపు బాడిగ వైపు మళ్లిందని తెలుస్తోంది. మరి అదే జరిగితే సింహాద్రి రమేష్కు ఎలా న్యాయం చేస్తారు అనే దానిపై క్లారిటీ లేదు. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది వైసీపీ అభ్యర్థుల ఎంపీకలో క్లారిటీ రావాల్సింది పోయి.. రోజు రోజుకి కన్ఫ్యూజన్ పెరుగుతోంది.