England: ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉంది. ఈ సందర్భంగా పాకిస్థాన్తో ఇంగ్లండ్ మూడు టెస్టుల సిరీస్లో పాల్గొనాల్సి ఉంది. తొలి టెస్టు రావల్పిండి వేదికగా డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అయితే ఈ టెస్టు మ్యాచ్ జరిగేది ఇప్పుడు అనుమానంగా మారింది. ఇంగ్లండ్ క్రికెటర్లు వరుసగా అస్వస్థతకు గురికావడం కలకలం రేపుతోంది. కెప్టెన్ బెన్ స్టోక్స్తో సహా జట్టులోని 14 మంది సభ్యులకు తెలియని వైరస్ సోకింది.
మొత్తం 15మంది సభ్యులతో ఇంగ్లండ్ టీమ్ పాకిస్థాన్లో అడుగుపెట్టగా 14 మంది వైరస్ కారణంగా ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో ఇంగ్లండ్ జట్టు సంక్షోభంలో చిక్కుకుంది. అయితే ఈ సమస్య ఫుడ్ పాయిజనింగ్ కావడంతోనే తలెత్తిందని భావిస్తున్నారు. ఈ పర్యటన కోసం ఇంగ్లండ్ జట్టు తమ ఆహారం కోసం ప్రత్యేకంగా చెఫ్ను నియమించుకుంది. అయితే మంగళవారం కొంతమంది ఆటగాళ్లు అనారోగ్యం బారిన పడ్డారు.
తొలుత ఆటగాళ్లకు వైరస్ సోకిందన్న అనుమానంతో వాళ్లను హోటల్ గదులకే అధికారులు పరిమితం చేశారు. వైరస్ బారిన పడిన వారిలో ఆటగాళ్లతో పాటు జట్టు సిబ్బంది కూడా ఉన్నారని సమాచారం అందుతోంది. స్టోక్స్, ఆండర్సన్ మొదట అనారోగ్యం బారిన పడగా ఆ తర్వాత జాక్ లీచ్, జో రూట్, మార్క్ వుడ్ వంటి ఆటగాళ్లలో కూడా అవే లక్షణాలు కనిపించడంతో వైరస్ సోకిందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ వైరస్ ఏమిటన్నది అంతుచిక్కడం లేదు.
తొలి టెస్టు జరగడం అనుమానమే
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పరిస్థితి ప్రస్తుతంగా విషమంగా ఉంది. తొలి టెస్టు మ్యాచ్కు ఒకరోజు ముందు కేవలం ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే ప్రాక్టీస్ సెషన్కు చేరుకున్నారు. అనారోగ్యం కారణంగా మిగతా ఆటగాళ్లు ప్రాక్టీస్కు రాలేకపోయారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు ఏ వైరస్ బారిన పడ్డారనేది ఇంకా నిర్ధారించలేదు. ఇది కరోనా వైరస్ లేదా మరేదైనా వైరస్ అన్న విషయంపై రీసెర్చ్ చేస్తున్నారు. అయితే మ్యాచ్కు ఇంకా 24 గంటల కంటే తక్కువ సమయం ఉండటంతో తొలి టెస్టు జరిగేది అనుమానంగా మారింది.