Sanju Samson: ఇటీవల కాలంలో టీమిండియాలో అన్యాయానికి గురైన ఆటగాడు ఎవరైనా ఉన్నాడంటే అది సంజు శాంసన్ మాత్రమే. టాలెంట్ ఉన్నా అతడికి తుది జట్టులో ఆడేందుకు అవకాశం ఇవ్వడం లేదు. ఈ అంశంపై అతడి అభిమానులతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు చేశారు. సంజు శాంసన్ను బీసీసీఐ కావాలనే బలిపశువును చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జట్టులో ఏ ఆటగాడికి అవకాశం ఇవ్వాలన్నా.. సంజూనే బలి చేయడం సరికాదని హితవు పలికారు.
ఐపీఎల్ 2022లో సంజు శాంసన్ అద్భుతంగా రాణించాడు. అయినా అతడికి టీ20 ప్రపంచకప్లో చోటు దక్కలేదు. సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్, రిషబ్ పంత్లను పరిగణనలోకి తీసుకున్న సెలక్టర్లు మరో వికెట్ కీపర్ను ఎంపిక చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే దినేష్ కార్తీక్, పంత్ ఇద్దరూ మెగా టోర్నీలో విఫలం అయ్యారు. దీంతో న్యూజిలాండ్ పర్యటనకు సంజు శాంసన్ను ఎంపిక చేశారు. కానీ కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే అతడిని ఆడించారు. ఈ మ్యాచ్లో రాణించినా ఆరో బౌలర్ కోసం తదుపరి రెండు మ్యాచ్లకు శాంసన్ను పక్కన పెట్టేశారు.
2015లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన సంజు శాంసన్ అన్ని ఫార్మాట్లలో ఇప్పటివరకు కేవలం 27 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. టీమిండియాలో దినేష్ కార్తీక్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, వృద్ధిమాన్ సాహా, కేఎస్ భరత్ వంటి కీపర్లు అందుబాటులో ఉండటంతో శాంసన్కు పెద్దగా అవకాశాలు రావడం లేదు. కానీ టాలెంట్ ఉన్న ఆటగాడిని ఎన్నాళ్లు పక్కనపెడతారని అతడి అభిమానులు బీసీసీఐ వైఖరిని తప్పుబడుతున్నారు.
సంజు శాంసన్కు ఐర్లాండ్ ఆఫర్
టీమిండియాలో చోటు దక్కడం లేదని ఆవేదన పడుతున్న శాంసన్కు పరాయి దేశం ఐర్లాండ్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని ఆహ్వానించింది. భారత క్రికెట్తో తెగదెంపులు చేసుకుని ఐర్లాండ్ వస్తే.. అన్ని అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడిస్తామని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు హామీ ఇచ్చింది. అయితే ఈ ఆఫర్ను శాంసన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. తాను భారత్ తరఫునే ఆడతానని ఐర్లాండ్ బోర్డుకు శాంసన్ స్పష్టం చేసినట్లు సమాచారం.