Ishan Kishan: ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. కేవలం 131 బంతుల్లో 10 సిక్సర్లు, 24 ఫోర్ల సహాయంతో 210 పరుగులు చేశాడు. దీంతో అందరి ప్రశంసలతో పాటు బీసీసీఐ దృష్టిలో పడిపోయాడు. ఈ నేపథ్యంలో 2023-24కు సంబంధించిన బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులోకి ఇషాన్ కిషన్ చోటు దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. నెల 21న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్లో సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను ఖరారు చేయనున్నారు.
కొన్నాళ్లుగా టీమిండియా తరఫున ఆడుతున్నా ఇషాన్ కిషన్కు సెంట్రల్ కాంట్రాక్టు దక్కలేదు. కానీ ఇప్పుడు అతడికి కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. వన్డే ఫార్మాట్తో పాటు టీ20 క్రికెట్ ఆడుతుండటంతో ఇషాన్ కిషన్కు బి లేదా సి కాంట్రాక్టు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక్క డబుల్ సెంచరీతో ఇషాన్ కిషన్ జాక్పాట్ కొట్టనున్నట్లు టీమిండియా మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు సెంట్రల్ కాంట్రాక్టులో సీనియర్ ఆటగాళ్లపై బీసీసీఐ వేటు వేయనుంది. కేవలం టెస్ట్ ఫార్మాట్ మాత్రమే ఆడుతూ పేలవ ప్రదర్శనతో జట్టుకు దూరమైన ఆజింక్యా రహానె, వృద్ధిమాన్ సాహా, ఇషాంత్ శర్మ కాంట్రాక్టులను బీసీసీఐ తొలగించే అవకాశం ఉంది. ఇప్పటికే వీరి కెరీర్కు శుభం కార్డు పడగా త్వరలో సెంట్రల్ కాంట్రాక్టులకు కూడా బీసీసీఐ ఎండ్ కార్డ్ వేయనుంది. ప్రస్తుతం రహానే, ఇషాంత్ శర్మ గ్రేడ్-బిలో ఉండగా.. వృద్ధిమాన్ సాహా గ్రేడ్-సిలో ఉన్నాడు.
టీ20 నంబర్వన్ ఆటగాడికి ప్రమోషన్
సీనియర్ ఆటగాళ్లపై వేటు పడనున్న నేపథ్యంలో వీరి స్థానంలో యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యాకు ప్రమోషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టీ20 నంబర్వన్ ఆటగాడు సూర్యకుమార్, శుభమన్ గిల్ ప్రస్తుతం గ్రేడ్-సిలో ఉండగా వీరికి ప్రమోషన్ దక్కనుంది. హార్దిక్ పాండ్యా కూడా గ్రేడ్-సిలో ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత పాండ్యా అద్భుత ఆటతో మెప్పిస్తున్నాడు. దీంతో అతడికి గ్రేడ్-ఎలో చోటు దక్కనుందని సమాచారం.