Gautham Gambir: టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ శ్రీలంకతో జరగనున్న సిరీస్ కు అందుబాటులో ఉండటం లేదు. వివాహం సందర్భంగా అతడు మ్యాచ్ లు ఆడటం లేదు. అలాగే బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో వేలి గాయమవ్వడంతో లంకతో టీ20 సిరీస్ కు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా దూరం కానున్నాడు. అయితే వన్డే సిరీస్ కు మాత్రం అతడు అందుబాటులోకి వచ్చేస్తాడు. దీంతో రోహిత్ తో కలసి 50 ఓవర్ల ఫార్మాట్ లో ఎవరు ఓపెనింగ్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
రోహిత్ తో కలసి ఓపెనింగ్ లో ఎవరు ఆడితే బాగుంటుందనే అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పలు సూచనలు చేస్తున్నారు. తప్పకుండా వన్డేల్లో యంగ్ లెఫ్టాండర్ ఇషాన్ కిషన్ తో ఓపెనింగ్ చేయించాలని గంభీర్ అంటున్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ సాధించి సంచలనం సృష్టించిన ఇషాన్ అయితేనే ఓపెనింగ్ కు న్యాయం చేయగలడని గంభీర్ చెబుతున్నాడు.
అతడ్ని ఓపెనర్గా ఆడించాల్సిందే: గంభీర్
‘శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్కు రోహిత్ శర్మతో పాటు ఓపెనర్గా ఎవరు రావాలనే దానిపై చర్చ జరగడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఎందుకంటే, అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్ ను ఓపెనర్ గా దింపాల్సిందే. ఇందులో ఎలాంటి చర్చకు తావులేదు. 35వ ఓవర్లోనే రెండొందల మార్క్ను దాటిన ఇషాన్ కిషన్ను కాదని మరొకరి వైపు చూడాల్సిన అవసరం ఇప్పుడు లేదనేది విస్పష్టం’ అని గంభీర్ పేర్కొన్నాడు.
‘ఇషాన్ కిషన్ ఎంతో ప్రతిభ గల ఆటగాడు. కీపింగ్తోపాటు నిలకడగా పరుగులు చేయగల సమర్థత అతడికి ఉంది. ఇంకెవరైనా ద్విశతకం సాధించే వరకు నా వరకైతే ఓపెనింగ్పై చర్చకు అసలు అవకాశమే లేదు’ అని గంభీర్ స్పష్టం చేశాడు. సూర్యకుమార్ యాదవ్ మీదా గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్యకుమార్ యాదవ్ భారత వన్డే క్రికెట్కు పెద్ద ఆస్తి అని మెచ్చుకున్నాడు.