Train Accident: ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్న ఒకే ఒక చర్చ ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించే. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన రైళ్ల ప్రమాదంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఈ ఘటనతో కోట్ల నష్టం జరిగింది. అంతేకాకుండా వందల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంకా కొన్ని వందలాదిమంది హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కాగా కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే మూడు రైళ్లు ఢీకొనడంతో పెద్ద ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను ఆదుకునేందుకు వివిధ సేవా సంస్థల నుంచి వాలంటీర్లు వచ్చారు.
బాధితులను రక్తదానం చేసి ఆదుకోవడానికి వేల సంఖ్యలో వచ్చిన యువతకు దేశం హ్యాట్సాఫ్ చెబుతోంది. ఈ రైలు ప్రమాదంలో గాయపడిన దాదాపు వెయ్యి మంది ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఒక వైపు బాధితులను ఆదుకునేందుకు రెస్క్యూ టీమ్ ఎంతో శ్రమిస్తుంది. దాంతో పాటు స్థానికులు కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి యువత స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అర్థరాత్రి సమయంలో గంటల కొద్ది క్యూ లైన్ లో నిలబడి మరీ బాధితులకు అవసరమైన రక్తం దానం చేశారు.
కటక్, బాలాసోర్, భద్రక్ లలో 2023, జూన్ 2 శుక్రవారం రాత్రి నుంచి దాదాపు 3 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించామని రక్తదానం చేసేందుకు యువత స్వచ్చందంగా తరలి రావడం ఎంతో సంతోషంగా ఉందని ఎస్సీబి మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో మెడిసిన్ ప్రొఫేసర్ జయంత్ పాండా అన్నారు. రక్తదానం చేసిన వారిలో యువతులు, మహిళలు కూడా ఉన్నారని కష్టాల్లో ఉన్నవారిని ఆదుకొకి ఈ భూమిపై ఇంకా మానవత్వం ఉందని చాటి చెప్పారని ఆయన తెలిపారు. అంతేకాకుండా కొంతమంది సర్వం కోల్పోయి అనాథ చిన్నారులను సంరక్షణ బాధ్యత తీసుకున్నారని మరికొంతమంది తమ సొంత వాహనాల్లో సమీప ఆసుపత్రులకు క్షతగాత్రులను తరలించారని పేర్కొన్నారు. ఇలాంటి సంక్షోభంలో ఉన్నపుడు సాటి వారిని ఆదుకొని మానతవ్వం చూపించిన వారి పట్ల నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.