Tadipatri: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతోంది. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో ఎక్కువగా చదువుకున్న వారే ఉండటం ఆశ్చర్యపోవాల్సిన విషయం. చిన్న చిన్న విషయాలకే ఊహించని నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు సోమవారం తెల్లవారుజామున సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
దాంతో ఆయన కుటుంబ సభ్యులు,పోలీస్ శాఖ వారు షాక్ అయ్యారు. తాడిపత్రిలోని నంద్యాల రోడ్డులో నివసిస్తున్న ఆయన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయారు. కాగా కుటుంబ సమస్యలే ఆయన ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన 1998లో సీఐగా బాధ్యతలు చేపట్టారు. డీఎస్పీ కావాల్సిన ఆయన ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకున్నారని ఆనందరావు మిత్రులు వాపోతున్నారు.
గత కొంత కాలంగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నట్టు తమ వద్ద చెప్పేవాడని మిత్రులు చెబుతున్నారు. కానీ ఇలా ఎవరు ఊహించని విధంగా ఆత్మహత్యకు పాల్పడుతారని ఎవరూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఉరికి వేలాడుతున్న సీఐని కుటుంబ సభ్యులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆనందరావు మృతిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. ఘటనా స్థలాన్ని అనంతపురం ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడి, ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆనందరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.