Vizag: తాజాగా ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. ఇంటర్ ఫలితాలు విడుదల అయినదే ఆలస్యం వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పరీక్షలో ఫెయిల్ అయ్యాము అన్న బాధతో ఇప్పటికే 9 మంది విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే. కేవలం ఒక ఏపీలో మాత్రమే ఇంటర్ విద్యార్థులు 9 మంది మరణించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఏపీలోనే చోటు చేసుకుంది. ఒక బాలుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు.
సబ్జెక్టులు పోయిన బాధలో విద్యార్థి ఏడుస్తూ కూర్చోగా కొందరు ఆ పిల్లాడిని అపార్థం చేసుకొని బట్టలూడదీసి కొట్టి విచక్షణ రహితంగా దాడి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం అక్కయ్యపాలెం రామకృష్ణ నగర్కు చెందిన నాగ రవికిరణ్ అనే 17 యువకుడు ఇంటర్లో ఫెయిల్ అయ్యాడు. కుటుంబ సభ్యులు ఏమంటారో అన్న భయంతో సమీపంలోని ఒక పాడుపడిన కారులో ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాడు. అయితే సదరు కారు వైకాపా ఉత్తరాంధ్ర యువజన సంఘం అధ్యక్షుడు సునీల్, తల్లి సింగాలమ్మలకు చెందినది. విద్యార్థి పరీక్షలు ఫెయిల్ అయిన బాధలో కారులో కూర్చుని ఏడుస్తూ ఉండగా, కారు దొంగతనానికి చేయడానికి వచ్చాడు అనుకున్న సునీల్ బాలుడిని ఇంట్లోకి ఈడ్చుకుని వెళ్లి డాబా పై దుస్తులు విప్పించి నగ్నంగా చితకబాదారు.
ఆ తర్వాత వాళ్ల కారు డ్రైవర్ తో కూడా కొట్టించారు. చేతిలో సెల్ఫోన్ లాక్కొని రాత్రి 9 గంటల నుంచి సుమారు 11గంటల వరకు అక్కడే నిర్బంధించారు. తర్వాత బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అబ్బాయి మా దగ్గర ఉన్నాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు కంగారుగా అక్కడికి చేరుకున్నారు. వాళ్లు కొట్టిన పిడిగుద్దులకు బాలుడి చెంపభాగం కమిలిపోయి వాపు కనబడటంతో ఇంత దారుణంగా కొడతారా అంటూ బాలుడి తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీంతో వాళ్లు దిక్కున్నచోట చెప్పుకోండంటూ బెదిరించారు. బాదిత బాలుడి తల్లిదండ్రులు బాలుడ్ని తీసుకుని గురువారం ఉదయం నాలుగో పట్టణ పోలీస్స్టేషన్కు చేరుకుని సీఐ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు.