YS Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొన్ని ఏళ్లుగా వివాదాల్లో ఉన్న చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తున్నారు. చుక్కల భూములపై సర్వ హక్కులు వారికే కల్పించేందుకు రెడీ అయ్యారు జగన్. ఈ నిర్ణయం వల్ల సుమారు 20 వేల కోట్ల రూపాయల విలువ చేసే 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంబంధించిన సంపూర్ణ హక్కులను రైతలుకు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్. ఈ నిర్ణయం వల్ల సుమారు 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు కలగనుంది.
చుక్కల భూమలుపై రైతులకే సర్వ హక్కులు అందించే కార్యక్రమాన్ని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ఈ కార్యక్రమం జరగనుంది. అయితే బ్రిటిష్ కాలంలో సుమారు 100 సంవత్సరాల క్రితం భూ సర్వే జరిగినప్పుడు ప్రభుత్వ భూమి లేదా ప్రైవేటు భూమి అని నిర్ధారణ చేయని కారణంగా రెవెన్యూ రికార్డుల్లో ఆ భూములకు సంబంధించిన పట్టాదారు గడిలో చుక్కలు పెట్టి వదిలేశారు. కాలక్రమేణా ఆ భూములే చుక్కల భూములుగా ప్రాచుర్యం పొందాయి. దీని వల్ల ఆ భూమలుపై దశాబ్దాలుగా రైతులకు సంపూర్ణ హక్కులు లేక అటు ఆ భూములు అనుభవిస్తున్నా వాటిని అమ్ముకునే స్వేచ్ఛ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దాంతో ఆ భూములకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపించి రైతులకు ఉపశమనం కలిగించాలని చూస్తున్నారు జగన్.
అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేస్తూ ప్రతి రైతన్న కుటుంబానికి మేలు చేయాలని నిర్ణయించారు. వారి ఆస్తిపై పూర్తి హక్కులు వారికే చెందాలని రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ రైతులు తిరిగే అవసరం లేకుండా, వారికి ఒక్క పైసా ఖర్చు లేకుండా సమస్య పరిష్కారం కావాలని చూశారు. దీనిలో భాగాంగానే నేడు సీఎం జగన్ దశాబ్దాల కాలం నాటి ఈ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ వాటిపై రైతులకే సర్వ హక్కులు కల్పించనున్నారు.