Ashwin-Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకతో తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మన్కడింగ్ రనౌట్ అప్పీల్ను వెనక్కి తీసుకోవడాన్ని అశ్విన్ తప్పుబట్టాడు. ఇతర ఔట్ల తరహాలోనే మన్కడింగ్ రనౌట్ను కూడా పరిగణించాలని సూచించాడు. బౌలింగ్ వేయకముందే నాన్ స్ట్రైకర్ క్రీజు ధాటితే రనౌట్ చేయడం నైతికమని ఐసీసీ నిబంధనల్లో కూడా చేర్చారని రోహిత్కు అశ్విన్ గుర్తుచేశాడు.
ఐసీసీ తన నిబంధనల్లో చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ మన్కడింగ్ రనౌట్ను అనైతికంగా భావించడం సరికాదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. మహమ్మద్ షమీని అప్పీల్ వెనక్కు తీసుకోమని రోహిత్ చెప్పడం సరికాదన్నాడు. బ్యాటర్లు, బౌలర్లకు సమాన అవకాశాలు ఉండాలని అశ్విన్ చెప్పాడు. ఎల్బీడబ్ల్యూ, క్యాచ్ ఔట్ విషయంలో కూడా రోహిత్ తన అప్పీల్ను ఇలా వెనక్కి తీసుకుంటాడా అని ప్రశ్నించాడు.
శ్రీలంకతో తొలి వన్డేలో మహమ్మద్ షమీ చేసింది సరైందేనని అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అతడు నిబంధనల మేరకే రనౌట్ చేసి అప్పీల్ చేశాడని తెలిపాడు. క్రికెట్లో సాధారణంగా ఫీల్డర్ అప్పీల్ చేస్తే.. అది ఔటైతే ఔటివ్వడం అంపైర్ విధి అని.. కానీ మన్కడింగ్ ఔట్పై ఇంకా భిన్నాభిప్రాయాలు ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నాడు.
బౌలర్ చేస్తే ఒకలా.. బ్యాటర్ చేస్తే మరోలా?
చాలా మ్యాచ్ల్లో క్యాచ్ ఔట్ అయినప్పుడు అంపైర్ నిర్ణయంతో సంబంధం లేకుండా బ్యాటర్లు పెవిలియన్కు చేరారని అశ్విన్ చెప్పాడు. అలాంటి సందర్భాల్లో ఏ బ్యాటింగ్ టీమ్ కెప్టెన్ కూడా ఔట్ ఇవ్వకముందే ఎందుకు వచ్చావు.. మళ్లీ బ్యాటింగ్కు వెళ్లు అని అడగలేదన్నాడు. అదే బౌలర్ ఔట్ చేస్తే.. అప్పీల్ వెనక్కి తీసుకోమని చెప్పడం ఏంటో అర్థం కావడం లేదన్నాడు. బ్యాటర్లకు ఒక న్యాయం, బౌలర్లకు మరో న్యాయమా? అని అశ్విన్ అసహనం వ్యక్తం చేశాడు.