Balayya: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా లేటెస్ట్ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమా రిలీజ్కు ముందే అదిరిపోయే ప్రి రిలీజ్ బజ్ ను ఇది సొంతం చేసుకుంది. బాలయ్య అఖండ లాంటి సూపర్ హిట్ తర్వాత చేసిన సినిమా కావడంతో పాటు ఇటు మలినేని గోపీచంద్ క్రాక్ లాంటి మాసీవ్ హిట్ తర్వాత తెరకెక్కించిన సినిమా కావడంతో భారీ అంచనాలతో సినిమా రిలీజ్ అయ్యింది.
అంతేకాకుండా అన్స్టాపబుల్ షోలతో బాలయ్యకు ఈమధ్య కాలంలో అద్భుతమైన ఇమేజ్ వచ్చిందని చెప్పాలి. బాలయ్యకు సమరసింహారెడ్డి, నరసింహానాయుడు టైంలో ఎంత పీక్ ఇమేజ్ ఉందో ఇప్పుడు కూడా అంతే ఇమేజ్ కనిపిస్తోంది. ఎక్కడ చూసినా జై బాలయ్య స్లోగన్ హైలెట్ అవుతూ ప్రేక్షకుల నోటి నుంచి వినపడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వీరసింహారెడ్డి ఏపీ, తెలంగాణ నుంచి ఓవర్సీస్ వరకు ఎక్కడ చూసినా తొలి రోజు వసూళ్లు అద్భుతంగా ఉన్నాయి.
మొదటి రోజు హైదరాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్స్లో టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డు ను వీరసింహారెడ్డి క్రియేట్ చేసిందని చెప్పాలి. చాలా లిమిటెడ్ టిక్కెట్ ధరలతో కూడా సెన్షేషనల్ వసూళ్లను వీరసింహారెడ్డి సినిమా రాబట్టింది. ఈ సినిమా కలెక్షన్లు చూసి ఇండస్ట్రీ వర్గాలకే సరికొత్త షాక్ తగిలింది. ఫస్ట్ డే ఒక్క ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్లలోనే ఏకంగా రూ.43 లక్షలకు పైగా గ్రాస్ ను వీరసింహారెడ్డి వసూళ్లు చేసింది. ఇది టాలీవుడ్లో ఇది వరకు వచ్చిన భారీ సినిమాలతో దాదాపు సమానం అని అందరూ అంటున్నారు.
సాధారణంగా భారీ సినిమాలకు టిక్కెట్ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ లిమిటెడ్ రేట్లతోనే ఆ ఏరియాలో వీరసింహారెడ్డి సినిమా విడుదలైంది. కానీ ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన వీరసింహా టిక్కెట్ రేట్లు పెంచుకుని వస్తే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హిస్టరీలోనే ఆల్ టైం3 బిగ్గెస్ట్ గ్రాసర్స్లో ఒక్కటిగా నిలిచి ఉండేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు వీరసింహారెడ్డి ప్లేస్ 4లో నిలిచిందని, ఇది వీరసింహ రెడ్డి గర్జనే అని ఫ్యాన్స్ అంటున్నారు.