Ananthapuram TDP: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. దీంతో అన్ని పార్టీలు ప్రచారం వేగాన్ని పెంచాయి. ఈ సారి టీడీపీ, వైసీపీ దృష్టి ఉమ్మడి అనంతపురం జిల్లాపై పడింది. మొదటి నుంచి టీడీపీ అనంతపురం జిల్లా కంచుకోట. కానీ, గత ఎన్నికల్లో 14 స్థానాలకు గానూ 12 స్థానాల్లో వైసీపీ గెలిచింది. కేవలం హిందూపురంలో బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ మాత్రమే గెలిచారు. అయితే, మరోసారి తమ కోటను పథిలం చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. పరిస్థితులు కూడా టీడీపీకి అనుకూలంగానే ఉన్నాయి. 10కి పైగా స్థానాల్లో టీడీపీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్య పడాల్సిన పని లేదని స్థానికంగా విశ్లేషణలు వస్తున్నాయి. వైసీపీ వేవ్ లో కూడా పయ్యావుల కేశవ్ గతసారి గెలిచారు. నియోజవర్గం సమస్యలతో పాటు.. రాష్ట్ర సమస్యలపై తనదైన శైలిలో ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ప్రశ్నించారు. దీంతో.. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం కనిపిస్తోంది. అంతేకాదు.. జేసీ ఫ్యామిలీ కూడా ఈసారి వారి నియోజకవర్గాలతో పాటు జిల్లాలో ప్రబావం చూపిస్తారు. వైసీపీ ప్రభుత్వ కేసులను తట్టుకొని నిలబడ్డారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా టీడీపీ జేసీ బ్రదర్స్ వలనే మంచి ఫలితాలు వచ్చాయి. ఇక, నందమూరి బాలకృష్ణ ప్రభావం కూడా పలు నియోజకవర్గాల్లో ఉంటుంది. ఆయన సొంత ఖర్చులతో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటికి తోడు ప్రభుత్వంపై వ్యతిరేకత, వైసీపీలో వర్గపోరు టీడీపీకి కలిసివచ్చేలా ఉంది.
ఉరవకొండ నుంచి గత ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ పోటీ చేసి గెలిచారు. ఈ సారి కూడా ఆయనే బరిలో ఉంటారు. వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి పోటీ చేస్తున్నారు. స్థానికంగా పయ్యవులకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. అధికారంలో లేనప్పటికీ ఆయన నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశారు. నియోజవర్గం సమస్యలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలోనే పలు సార్లు నిలదీశారు. అంతేకాదు.. అసెంబ్లీలో ఆయన మాటతీరుతో రాష్ట్రా వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో మరోసారి పయ్యావుల గెలుపు ఖాయమని తెలుస్తోంది.
కళ్యాణ దుర్గంలో టీడీపీ నుంచి సురేందర్ బాబు పోటీ చేస్తున్నారు. అటు.. వైసీపీ తలారి రంగయ్యను బరిలో దించుతోంది. రెండు పార్టీల అభ్యర్థులు నియోజకవర్గానికి కొత్త ముఖాలే. అయితే, ఐదేళ్లుగా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. దీంతో.. ప్రభుత్వంపై స్థానికంగా వ్యతిరేకత ఉంది. దీంతో.. వైసీపీలో వర్గపోరు కూడా టీడీపీకి కలిసి వచ్చేలా ఉంది.
గుంతకల్లులో కూటమి అభ్యర్థి ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ.. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా వెంకటరామి రెడ్డి ఉన్నారు. ఆయనే మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయన బీసీలను కలుపుకుపోవడంలో విఫలమైయ్యారు. అంతేకాదు.. బీసీలను అవమానిస్తున్నారనే విమర్శలు వెంకటరామిరెడ్డిపై ఉన్నాయి. దీంతో.. కూటమి నుంచి ఎవరు పోటీ చేసినా వైసీపీ ఓటమి ఖాయంగా తెలుస్తోంది.
తాడిపత్తి నుంచి చంద్రబాబు అస్మిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కేతిరెడ్డి నియోజవర్గ అభివృద్ధి కంటే.. వివాదాలతోనే పదవీకాలం గడిపేశారు. దీంతో.. ఆయనపై తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. అంతేకాదు..అవినీతి ఆరోపణలు కూడా కేతిరెడ్డిపై వినిపిస్తున్నాయి. కాబట్టి అస్మిత్ రెడ్డి గెలుపు ఖాయంగా తెలుస్తోంది.
రాయదుర్గం నుంచి కాల్వ శ్రీనివాసులు టీడీపీ తరుఫున పోటీ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి ఈసారి జగన్ అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరగా.. కాల్వ శ్రీనివాసులకు బీజేపీ, జనసేనతో పొత్తు కలిసివస్తుంది.
శింగనమల నుంచి టీడీపీ తరుఫున బండారు శ్రావణి పోటీ చేస్తున్నారు. గత ఎణ్నికల్లో జొన్నలగడ్డ పద్మావతి వైసీపీ తరుఫున గెలిచారు. కానీ, ఈసారి ఆమెను తప్పించి వీరాంజనేయులను సమన్వయకర్తగా నియమించింది. వీరాంజనేయుల నియామకాన్ని వైసీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో.. ఈ ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు ఎంతవరకూ సీరియస్ గా పని చేస్తారో తెలియదు. వైసీపీలో వర్గపోరు బండారు శ్రావణికి కలిసి వస్తుంది. అటు, ఆమె కూడా గతకొంత కాలంగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు.
కదిరి నియోజకవర్గం నుంచి పెడబల్లి వెంకట సిద్దారెడ్డి విజయం సాధించాడు. అయితే ఈసారి వైసీపీ అధిష్టానం వెంకట సిద్దారెడ్డిని పక్కనపెట్టి కదిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా మక్బూల్ అహ్మద్ ను ప్రకటించింది. అయితే, హైకమాండ్ నిర్ణయాన్ని ప్రస్తుత ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, నియోజకవర్గ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. మంత్రి పెద్దారెడ్డి పలుసార్లు అసంతృప్త నేతలతో చర్చలు జరిపినా ఫలితం కనిపించలేదు. మరోవైపు ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా కందికుంట యశోదాదేవి (టీడీపీ) పోటీ చేస్తున్నారు. వైసీపీలో వర్గవిబేధాలకు తోడు.. నియోజకవర్గంలో గత ఐదేళ్ల కాలంలో అభివృద్ధి జరగకపోవటం యశోదాదేవి విజయానికి దోహదపడతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ధర్మవరం నుంచి కూటమి పార్టీలు టీడీపీ, బీజేపీ రెండూ పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ ఇంకా కూటమి నుంచి అభ్యర్థి ఖరారు కాలేదు. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై స్థానికంగా వ్యతిరేకత ఉంది. దీనికితోడు పరిటాల శ్రీరాం ఐదేళ్లుగా పట్టుపెంచుకున్నారు. పరిటాల శ్రీరామ్ కు టికెట్ ఇస్తే విజయం నల్లేరుపై నడక అవుతుందని ఓ అంచనా. బీజేపీకి టికెట్ ఇస్తే శ్రీరాం సహకారంపైవ విజయావకాశాలు ఉంటాయి.
పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథరెడ్డి కోడలు పల్లె సంధూరారెడ్డికి టీడీపీ టికెట్ కేటాయించింది. చిన్న వయసులోనే ఆమె చాలా యాక్టివ్ గా ప్రజల్లో తిరుగుతున్నారు. వైసీపీ అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిపై లోకల్ తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో సింధూరారెడ్డి విజయానికి ఢోకాలేదని అంటున్నారు.
రాప్తాడు నుంచి టీడీపీ తరుఫున పరిటాల సునీత పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గతంలో పరిటాల శ్రీరాం పోటీ చేసి ఓడిపోయారు. ఈ సింపతి ఇక్కడ వర్క్ అవుట్ అవుతుందని అంచనా. దానికి తోడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గత ఐదేళ్లుగా చేసిందేమీ లేదని అంటున్నారు.
ఇక హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా బాలకృష్ణ పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. దీంతో.. మరోసారి ఆయన హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.