Bandi Sanjay Kumar: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్ని రోజుల నుండి ఛాతీ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఆయన అనారోగ్య సమస్య మరింత దిగజారటంతో వరంగల్ లో నిర్వహించాలనుకున్న సభను కూడా రద్దు చేశారు. దీంతో ఆయన ఆరోగ్యం కుదుటపడాలని ఆయన కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు కోరుకుంటున్నారు.
ఇక కేసీఆర్ సతీమణి శోభ తన భర్త ఆరోగ్యం కోసం కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. నిజానికి శోభ ఏ రోజు కూడా భర్త తోడు లేకుండా ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టలేదు. కానీ మొదటిసారి తన భర్త ఆరోగ్యం కోసం తిరుమల శ్రీవారిని దర్శించుకొని తొలిసారిగా తన తలనీలాలు కూడా సమర్పించింది. ఇక ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవ్వడంతో భర్త కోసం తను చేస్తున్న మంచి పనికి ఫిదా అవుతున్నారు జనాలు.
అయితే ఇదిలా ఉంటే మరోవైపు బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆదిలాబాద్ లో నిర్వహించిన జనగర్జన సభలో కేసీఆర్ గురించి కొన్ని ఆశ్చర్యపరిచే మాటలు మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నా గురువు.. ఆయన నుంచే ఈ భాష, మాటలు నేర్చుకున్నాను. ఆయన నిండు నూరేళ్ళు చల్లగా, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకొంటున్నానని అనడంతో అక్కడున్న వాళ్లంతా ఆయన మాటలకు ఆశ్చర్యపోయారు. కానీ నిజానికి బండి సంజయ్ మనస్ఫూర్తిగా కేసీఆర్ ను పొగడలేదని వెటకారంగా వ్యాఖ్యలు చేశాడని అర్థమవుతుంది.
పైగా కల్వకుంట్ల ఇంట్లో అధికారం కోసం కొట్లాటలు పతాకస్థాయికి చేరుకున్నాయని కామెంట్ చేశాడు. అంతేకాకుండా కేసీఆర్ తన గురువని ఆయనకు ఏమైనా అయితే తట్టుకోలేను అంటూ.. కొన్ని రోజుల నుంచి ఆయన ప్రజలకు, మీడియాకు కనబడటం లేదని.. అది తనకు చాలా ఆందోళన కలిగిస్తుందని.. నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడున్నారు.. ఆయనను కేటీఆర్ ఏం చేశారు.. ఆయన క్షేమంగా ఉన్నారని ఒక్క మాట చెప్పాలని నేను బిఆర్ఎస్ పార్టీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నాను అని వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.