Bandi Sanjay vs Ponnam Prabhakar: కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో పొలిటికల్ వార్ రోజురోజుకు ముదురుతోంది. సవాల్కు ప్రతి సవాల్ అంటూ మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. రాజకీయాల పరంగా తాను ఓడిపోతే సన్యాసం తీసుకుంటున్నాను అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడు విషయంలో నేను తప్పు మాట్లాడితే సజీవ దహనం అవుతాను అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్లు చేశారు.
త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో బండి సంజయ్ నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పొన్నం ప్రభాకర్ కి టార్గెట్గా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో.. ఈ యాత్రకు అక్కడక్కడా కాంగ్రెస్ నాయకుల నిరసనల సెగ తగులుతూనే ఉంది.
కేవలం నా యాత్రకు అడ్డు వస్తున్నారని విషయంలో ప్రశ్నించాను తప్ప తాను ఎవరి తల్లి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని బండి సంజయ్ తెలిపారు. ఇక అవసరమైతే తాను పొన్నం తల్లి కాళ్ళు మొక్కుతానని తెలిపారు. శుక్రవారం ఎల్కతుర్తిలో జరిగిన యాత్రలో మాత్రం తన మాటలను సమర్థించుకున్నారు బండి సంజయ్. రాముడు ఎక్కడ పుట్టాడో తెలియదన్న వారికి.. తమ తల్లి ఎవరో తెలుసా అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇప్పటికే బండి సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజాహిత యాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి బండి సంజయ్ ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో వివాదంగా మారాయి. ఇప్పటికే రాష్ట్రంలో గులాబీ పార్టీది మూడో స్థానం అంటున్న రెండు పార్టీలు.. మొదటి స్థానం కోసమే మా ఫైట్ అంటూ బాహాటంగానే ప్రకటిస్తున్నాయి. మొత్తంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ బండి సంజయ్ మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్లో ఇంకా ఎన్ని సవాళ్లు బయటపడతాయో తెలియాల్సి ఉంది.