Bengaluru: ప్రస్తుత రోజుల్లో ఆడపిల్లల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. సమాజంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. మనవాళ్లే కదా అని నమ్మితే వారిపై అత్యాచారాలు మానబంగాలు, మానసిక వేధింపులు లాంటి వాటికి పాల్పడుతున్నారు. తాజాగా కూడా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. తెలిసినవాడే కదా అని ఒక యువతి, యువకుడిని నమ్మినందుకు చివరికి తన ప్రాణాలే కోల్పోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని కోలార్ జిల్లా, ముల్బాగల్ తాళాకాకు చెందిన లయ స్మిత, పవన్ కల్యాణ్ ఇద్దరు స్నేహితులు.
అయితే వీరు బెంగళూరులో వేరు వేరు కాలేజీల్లో చదువుతున్నారు. లయ బెంగళూరులోని ఓ ప్రైవేట్ యూనివర్శిటీలో బీటెక్ చదువుతోంది. పవన్ ఓ ప్రైవేట్ కాలేజ్లో బీసీఏ చదువుతున్నాడు. ఇక తాజాగా సోమవారం పవన్ కల్యాణ్, లయ ఉంటున్న యూనివర్శిటీకి వెళ్లాడు. ఇద్దరూ కొద్ది సేపు మాట్లాడుకున్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ, పవన్ లయపై కత్తితో దాడి చేశాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో పవన్ లయ పై అత్యంత కిరాతకంగా 19 సార్లు పొడిచాడు. తీవ్ర గాయాల పాలైన లయ అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తనను తాను కత్తితో పొడుచుకున్నాడు.
అయితే పవన్ కళ్యాణ్ పొడుస్తున్న సమయంలో లయ గట్టి గట్టిగా అరవగా ఆ అరుపులు విన్న కొందరు విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. మడుగులో ఉన్న ఇద్దరిని గుర్తించి కాలేజీ సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్న కాలేజీ సిబ్బంది ఆ ఇద్దరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే లయ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇక ప్రాణాలతో ఉన్న నిందితుడు పవన్ కళ్యాణ్ కి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం అతను చికిత్స తీసుకుంటుండడంతో అతను కోలుకున్న తర్వాత హత్యకు గల కారణాలేంటి అన్నదానిపై విచారిస్తామని తెలిపారు.