Viveka Case CBI: వివేకా హత్య కేసు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ వివేక హత్య కేసులో ఆరోపణలు, కేసులు అనేక కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఏపీ లో ప్రస్తుతం వివేకా హత్య కేసులో సీబీఐ తుది చార్జిషీట్ సంచలనం రేకెత్తిస్తోంది. గతంలో తానే వేసిన చార్జిషీట్లో గూగుట్ టేక్ అవుట్కు సంబంధించిన సమాచారం తప్పని, తుది చార్జిషీట్లో సీబీఐ పేర్కొనడం గమనార్హం. దీంతో విచారణలో నిజాలు నిగ్గు తేల్చడంలో సీబీఐ ఔట్ అయ్యిందనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. కాగా ఇప్పటికే సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు వేసిన తుది గడువు ముగిసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని సీబీఐ కోర్టులో గత బుధవారం దర్యాప్తు సంస్థ తుది చార్జిషీట్ను వేసింది. వివేకా హత్య కేసులో నిందితులను గూగుల్ టేక్ అవుట్ పట్టించిందని ఇంత కాలం సీబీఐ చెబుతూ వచ్చింది. అయితే గూగుల్ టేక్ అవుట్ ద్వారా సేకరించిన సాంకేతిక సమాచారం ఆధారంగానే కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. నిందితులు సునీల్ యాదవ్, ఉదయ్ కుమార్ రెడ్డి వివేకాను హత్య చేసిన అనంతరం కడప ఎంపీ అవినాష్రెడ్డి ఇంట్లో ఇంటి పరిసరాల్లోనూ ఉన్నారని గూగుల్ టేక్ అవుట్ ద్వారా తెలుసుకున్నట్టు సీబీఐ పేర్కొంది. అయితే ఇప్పుడు ఇదే సీబీఐ మాట మార్చింది. సీబీఐ రెండు నాల్కుల ధోరణి గురించి చూసుకుంటే..
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ఇంట్లో 2019, మార్చి 14న రాత్రి సునీల్ యాదవ్ ఉన్నాడు. అర్ధరాత్రి దాటాక 2.35 గంటలకు వివేకా నివాసం సమీపంలో, 2.42 గంటలకు నివాసం లోపల ఉన్నాడు. సునీల్ సెల్ నంబర్ గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించినట్లు సీబీఐ గతంలో పేర్కొంది. తాజాగా తుది నివేదికలో మాట మార్చింది. అదంతా నిజం కాదని సీబీఐ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో స్పష్టం చేసింది. వివేకా ఇంట్లో 2019, మార్చి 14 అర్ధరాత్రి దాటిన తర్వాత సునీల్ యాదవ్ లేడు. 2019, మార్చి 15న ఉదయం 8.05 గంటలకు వివేకా ఇంటి బయట, 8.12 గంటలకు ఇంటిలోపల వున్నాడు. గతంలో గ్రీన్విచ్ కాలమానం ప్రకారం గూగుల్ టేక్ అవుట్ ద్వారా తెలుసుకున్నాం. కానీ ఏ దేశంలోనైనా స్థానిక కాలమానం ప్రకారమే చూడాలి. భారత కాలమానం ప్రకారం దానికి 5.30 గంటల సమయం కలపాలి. గతంలో సమాచార సేకరణలో పొరపాటు పడ్డాం అని సీబీఐ అత్యంత కీలకమైన చివరి చార్జిషీట్లో పేర్కొనడం ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది. వివేకా హత్య కేసులో చివరి చార్జిషీట్ అత్యంత కీలకమైందని కొంత కాలంగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఈ చార్జిషీట్ వివేకా హత్య కేసులో దోషులెవరో తేలుతుందనే ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే కడప ఎంపీ అవినాష్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయానికి సంబంధించి ఇంత కాలం సాగుతున్న ప్రచారం అంతా ఉత్తుత్తిదే అని సీబీఐ వేసిన తుది చార్జిషీట్ తేల్చి చెబుతోంది.