Roja: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యార్థుల కోసం విద్యా దీవెన అనే పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రతి ఏటా విద్యార్థులకు పదివేల రూపాయలు చొప్పున విద్యా దీవెనను అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఏపీ మంత్రి ఆర్కే రోజా విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాలకు డబ్బు జమ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యర్థులపై రోజా చెలరేగిపోయారు. పంచ్ డైలాగ్లతో ప్రత్యర్థులపై రోజా విరుచుకుపడుతుంటే, సీఎం జగన్ నవ్వుతూ కనిపించారు. ఈ సందర్భంగా ఇద్దరి కోసం స్పెషల్ పవర్స్ని వినియోగించాలని రోజా విన్నవించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
అయితే రోజా విమర్శిస్తున్న ఆ ఇద్దరు మరెవరో కాదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన దత్త పుత్రుడిగా వైసీపీ ముద్దుగా పిలుచుకునే పవన్ కల్యాణ్. వాళ్లిద్దరికీ విద్యా దీవెన పథకం కింద లబ్ధి చేకూర్చాలని ఆమె సభా వేదికపై నుంచి సీఎంను కోరారు. జగన్ అన్నకు చిన్న రిక్వెస్ట్. అన్నా ఇన్ని లక్షల మందికి విద్యా దీవెన ఇస్తున్నాము. ఇంకో ఇద్దరికి కూడా విద్యా దీవెన ఇవ్వాలని కోరుకుంటున్నాను. వాళ్లెవరో కాదు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్. ఇంటర్లో తన గ్రూప్ పై ఒక్కో సారి ఒక్కో విధంగా పవన్ కల్యాణ్ చెప్పారు. ఒకసారి సీఈసీ, మరోసారి హెచ్ఈసీ, ఎంపీసీ అని చెప్పారు.
చంద్రబాబేమో ఇంజనీరింగ్ చదవాలంటే ఇంటర్లో బైపీసీ తీసుకోవాలని చెబుతున్నారు. వీళ్లిద్దరికీ విద్యా దీవెన వర్తింప జేద్దామంటే ఏపీలో వాళ్లకు ఇల్లు లేదు. ఓటు లేదు. ఆధార్ కార్డు కూడా లేదు. ముఖ్యమంత్రికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఆ పవర్స్ని ఉపయోగించి వాళ్లిద్దరికీ మంచి చదువు చెప్పించాలి అని జగన్ను రోజా కోరారు. కాగా వీళ్లంతా పిచ్చిపిచ్చి మాటలతో ఊగిపోతూ ఒకడు, జారిపోతూ ఒకడు, మరిచిపోతూ ఒకడు రాష్ట్ర ప్రజానీకాన్ని విసిగిస్తున్నారంటూ రోజా ఒక రేంజ్ లో మండిపడ్డారు. సినిమా డైలాగ్లతో ప్రత్యర్థులను ఒక రేంజ్లో రోజా ఆడుకోవడంతో ఆమె ప్రసంగం హైలెట్గా నిలిచింది. ఈ సందర్భంగా రోజా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ వాఖ్యలపై టీడీపీ నేతలు జనసేన నేతలు స్పందిస్తూ రోజాపై ఒక రేంజ్ లో మండిపడుతున్నారు.