Chandrababu Naidu: ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు ఏకపక్షంగా తీర్పునిచ్చారు. ఈసారి కూడా అంతకుమించి అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. జగన్ ఏకంగా వై నాట్ 175, వై నాట్ కుప్పం అంటున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి లేదు. టీడీపీ, జనసేన వైపు ప్రజల గాలి మళ్లింది. ఈ విషయం జగన్ కు కూడా అర్థం అయింది కనుక టికెట్ల పంపిణీ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. సిట్టింగులను మార్చి కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నారు. సిట్టింగులను కూడా కొత్త స్థానాలకు పంపిస్తున్నారు. అయితే.. అత్తెసరు మెజారిటీతో అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జగన్ బలంగా నమ్ముతున్నారు. అధికారంలోకి వస్తున్న తొలినాళ్ల నుంచి ఇస్తున్న సంక్షేమ పథకాలు, దొంగ ఓట్లు, వాలంటీర్ల సహకారం వైసీపీని విజయతీరాలకు చేరుస్తుందని ఆ పార్టీ నేతల నమ్మకం.
ఈ ఎన్నికలు కురుక్షేత్ర మహాసంగ్రామమని జగన్ చెప్పారు. అంటే.. విజయ అవకాశాలు ఏకపక్షంగా ఉండవని చెప్పకనే చెప్పారు. ఇక చంద్రబాబు, పవన్ మాత్రం ధీమాగా ఉన్నట్టు కనిపిస్తోంది. వైసీపీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని.. అందుకే ప్రజలు తమవైపు చూస్తున్నారని భావిస్తున్నారు. అంతే కాదు.. వై నాట్ కుప్పం అని చెబుతున్న జగన్ కు గట్టి షాక్ ఇవ్వాలని టీడీపీ, జనసేన వ్యూహాలను సిద్దం చేస్తోంది. ఇప్పుడు ఆ రెండు పార్టీలు వై నాట్ పులివెందుల అంటున్నారు. అంతేకాదు వైసీపీలో కీలక నేతలను టార్గెట్ పెట్టుకొని ఓడించాలి ఉమ్మడి వ్యూహం సిద్దం చేస్తున్నారు.
పులివెందులలో జగన్ తో పాటు.. నగరిలో రోజా, పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ, మంగళగిరిలో గంజి చిరంజీవిని కనీవినీ రీతిలో ఓడించాలని చూస్తున్నారు. అందుకే కీలకమైన వైసీపీ నియోజవర్గాలను తమ ఖాతాలో వేసుకోవాలని బాబు, పవన్ వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. వైసీపీ కంచుకోటలో పాగా వేసి 150 స్థానాలు గెలవాలని అనుకుంటున్నారు. అయితే, వైసీపీ నేతల దగ్గర ఉన్న ఆర్థికబలం, అంగబలం ముందు పోటీ చేసి 150 స్థానాలు గెలుపు కష్టమేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ముందే గ్రహించిన చంద్రబాబు, పవన్.. బీజేపీ అండదండల కోసం ప్రయత్నిస్తున్నారు. అందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా, నడ్డాతో మాట్లాడారు. ఈ విషయం కేంద్రపెద్దల దగ్గర పెండింగ్లో ఉంది. బీజేపీ చంద్రబాబుతో పొత్తుకు ఓకే చెబితే.. వై నాట్ పులివెందుల నినాదాన్ని నిజం చేయొచ్చు. అంతేకాదు.. కీలక నేతలను ఓడించడంతో పాటు 150 స్థానాలను సొంత చేసుకోవచ్చు.