Cricket: 2022 ఏడాదిని టీమిండియా ఓటమితో ప్రారంభించి విజయంతో ముగించింది. మొత్తానికి టీమిండియా ఈ ఏడాది చివరి మ్యాచ్ ఆడేసింది. బంగ్లాదేశ్తో ఆడిన రెండో టెస్టు ఈ ఏడాది భారత్కు చివరి మ్యాచ్. ఈ ఏడాది మొత్తం 71 మ్యాచ్లు ఆడిన భారత్ 46 మ్యాచ్లలో విజయం సాధించింది. 21 మ్యాచ్లలో ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ టై కాగా మూడు మ్యాచ్లలో ఫలితం రాలేదు. భారత్ విజయాల శాతం 64.78గా నమోదైంది.
ఈ ఏడాది మొత్తం ఏడు టెస్టు మ్యాచులు ఆడిన భారత జట్టు అందులో నాలుగు మ్యాచ్లలో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా పర్యటనలో రెండు టెస్టులను ఓడిపోయిన టీమిండియా.. ఇంగ్లండ్తో జరిగిన టెస్టులోనూ ఓటమిపాలైంది. అయితే పసికూన జట్లు శ్రీలంక, బంగ్లాదేశ్లతో జరిగిన టెస్టుల్లో మాత్రం భారత్ విజయం సాధించింది. స్వదేశంలో శ్రీలంకతో టెస్ట్ సిరీస్ వైట్ వాష్ చేయగా.. తాజాగా బంగ్లాదేశ్ గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్ను కూడా సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది.
ఈ ఏడాది వన్డే ఫార్మాట్లో భారత్ ఆశించింనంతగా రాణించలేదు. ఈ క్యాలెండర్ ఇయర్లో భారత జట్టు మొత్తం 24 వన్డే మ్యాచులు ఆడింది. వీటిలో 14 మ్యాచుల్లో టీమిండియా విజయాలు నమోదు చేసింది. రెండు మ్యాచులలో ఫలితం తేలలేదు. మిగిలిన 8 మ్యాచుల్లో ఓటములు చవిచూసింది. ఈ ఏడాది చివర్లో బంగ్లాదేశ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లోనూ భారత్ ఓడిపోయింది.
అచ్చొచ్చిన ఫార్మాట్లో అదిరిపోయే ప్రదర్శన
టీ20లలో నంబర్వన్ ర్యాంక్లో కొనసాగుతున్న టీమిండియా ఈ ఏడాది టీ20 ఫార్మాట్లో రాణించింది. భారత జట్టు ఈ ఏడాది మొత్తం 40 అంతర్జాతీయ టీ20 మ్యాచులు ఆడగా 28 మ్యాచ్లలో విజయం సాధించింది. 10 మ్యాచ్లలో ఓటమి పాలు కాగా ఒక మ్యాచ్ టై, మరో మ్యాచ్లో ఫలితం రాలేదు. టీ20 ఫార్మాట్లో భారత్ విజయాల శాతం 70గా ఉంది. అయితే ఆసియా కప్, టీ20 ప్రపంచకప్లో మాత్రం భారత్ ఆశించిన మేర ప్రదర్శన చేయలేకపోవడం గమనించాల్సిన విషయం.