Food Varieties: సూపర్స్టార్ కృష్ణ మరణించి 11 రోజులు దాటుతోంది. నవంబర్ 15వ తేదీన ఉదయం ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు కృష్ణ దశదిశ కర్మ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. తొలుత కృష్ణ పెద్దకర్మ కార్యక్రమాన్ని మహేష్బాబు ఇంట్లో నిర్వహించారు. నానక్ రామ్ గూడలోని విజయకృష్ణ నివాసంలో చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత హైదరాబాద్లో రెండు ప్రాంతాలలో అతిథుల కోసం భోజన ఏర్పాట్లు చేశారు.
ఘట్టమనేని కుటుంబ అభిమానుల కోసం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలకు హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్లో భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా సుమారు 5వేల పాసులు జారీ చేయగా 8 వేల మందికి పైగా తరలివచ్చారు. తన తండ్రి కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి వచ్చిన అభిమానులకు మహేష్బాబు ఏర్పాటు చేసిన వంటకాల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో అభిమానుల కోసం భోజనాలు ఏర్పాటు చేయగా సుమారు 40 రకాల వంటకాలను వడ్డించినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో వెజ్, నాన్ వెజ్ వంటకాలు ఉన్నాయి. కృష్ణకు ఎంతో ఇష్టమైన తందూరి చికెన్ కూడా వడ్డించారు. ఎక్కువ మంది అభిమానులు వస్తారని ముందుగానే ఊహించిన మహేష్ కుటుంబ సభ్యులు వారందరికీ తగినట్లుగానే భోజనం ఏర్పాటు చేశారు. దీంతో మహేష్బాబును దేవుడు చల్లగా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మహేష్ ఎమోషనల్ స్పీచ్
జేఆర్సీ కన్వెన్షన్లో జరిగిన కృష్ణ పెద్దకర్మ కార్యక్రమానికి కృష్ణ కుటుంబసభ్యులతో పాటు వేలాది అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానులతో మాట్లాడుతూ.. మహేష్ బాబు ఎమోషనల్ అయ్యాడు. తన తండ్రి తనకు ఎన్నో ఇచ్చారని.. వాటిలో గొప్పది.. మీ అభిమానం. దానికి ఆయనకు తాను రుణపడి ఉంటానని మహేష్ అన్నాడు. నాన్నగారు ఎప్పుడూ తన గుండెల్లోనే ఉంటారని చెప్పాడు. ఆయన ఎప్పుడూ మన మధ్యే ఉంటారని.. మీ అభిమానం, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అంటూ మహేష్ ప్రసంగించాడు.