Ganesh: వినాయకుడు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది తొండం. ఏనుగు తొండంతో, బొజ్జ కడుపుతో, పెద్ద చెవులతో ఎంతో ప్రత్యేకంగా కనిపించే వినాయకుడి రూపం అందరికీ తెలిసిందే. మనం కొలిచే ప్రతి చోట వినాయకుడు ఇదే రూపంలో ఉండటాన్ని మనం చూస్తుంటాం. అయితే వినాయకుడిని తొండం లేకుండా ఊహించుకోగలరా?
అవును, వినాయకుడు తొండం లేకుండా, నరరూపంలో కనిపించే ఓ ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఆ ఆలయంలో ఉన్న వినాయకుడు తొండం లేకుండా మామూలు మనిషిలాగా దర్శనమిస్తుంటాడు. ప్రపంచం మొత్తంలో వినాయకుడు ఈ రూపంలో కేవలం ఆ ఒక్క దేవాలయంలో మాత్రమే కనిపిస్తుంటాడు. ఇంతకీ ఆ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం.
తమిళనాడులోని తిలతర్పణ పురి అనే గ్రామంలో ఉన్నటు వంటి ముక్తీశ్వరా ఆలయ ప్రాగణంలో ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో కొలువైన వినాయకుడిని ‘నరముఖ గణపతి’గా పిలుస్తారు. ఇలాంటి తొండం లేని వినాయకుడి గుడి ప్రపంచంలో ఇది మాత్రమే ఉందని తెలుస్తోంది. ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు, తిరిగి సాయంత్రం 4గంటల నుండి రాత్రి 9గంటల వరకు తెరిచి ఉంటుంది.
తిలతర్పణ పురి పురాణం ఇది:
తిలతర్పణ పురికి ప్రత్యేకమైన స్థల పురాణం ఉంది. ఇక్కడ శ్రీరాముడు తన తండ్రికి తర్పణం సమర్పించాడని ప్రసిద్ధి. తిల అంటే నువ్వులు అని, తర్పణం అంటే సమర్పించడం అని అర్థం. ఇక్కడ పితృదేవతలకు తర్పణం సమర్పిస్తే వారికి అన్ని రకాలుగా శాంతి చేకూరుతుందని స్థల పురాణం చెబుతోంది.