Hardik Pandya: ఐసీసీ టీ20 ర్యాంకుల్లో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే బడా ఈవెంట్లలో మాత్రం చతికిలపడుతోంది. ఇటీవల ఆసియా కప్తో పాటు టీ20 ప్రపంచకప్లోనూ కనీసం ఫైనల్ చేరలేకపోయింది. గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో పాకిస్థాన్పై 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత ఇటీవల టీ20 ప్రపంచకప్ సెమీస్లో ఇంగ్లండ్పై కనీసం ఒక్క వికెట్ కూడా తీయకుండానే చిత్తుగా ఓడింది. దీంతో జట్టు బలాబలాలపై అందరిలోనూ అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ సహా అందర్నీ తొలగిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. టీమిండియాకు మూడు ఫార్మాట్లలో వేర్వేరు కెప్టెన్లను నియమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా టీ20 జట్టు కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను ఖరారు చేసినట్లు సమాచారం అందుతోంది. కొత్త సెలక్షన్ కమిటీ ఏర్పడగానే త్వరలోనే ఈ విషయంపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనుంది.
మరోవైపు టెస్టు కెప్టెన్గా రోహిత్ శర్మను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమిస్తే వన్డే జట్టు కెప్టెన్గా ఎవరిని నియమిస్తారనే విషయం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతానికి శిఖర్ ధావన్ను వన్డే జట్టు కెప్టెన్గా నియమించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే న్యూజిలాండ్ పర్యటన కోసం టీ20లకు హార్దిక్ పాండ్యాను, వన్డేలకు శిఖర్ ధావన్ను బీసీసీఐ కెప్టెన్గా నియమించింది. భవిష్యత్లోనూ వీరినే ఆయా జట్లకు కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం.
వన్డే వరల్డ్ కప్కు కెప్టెన్ ఎవరు?
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, బుమ్రా, శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా… ఇలా సిరీస్కో కెప్టెన్ను టీమిండియా మేనేజ్మెంట్ మారుస్తూ సాగుతోంది. ఈ కారణంగానే టీ20 ప్రపంచకప్లో భారత్ వైఫల్యం చెందిందని పలువురు భావిస్తున్నారు. మరి వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్లో భారత్కు ఎవరు సారథ్యం వహిస్తారనే ప్రశ్న అందరిలోనూ రేకెత్తుతోంది. అయితే 2023 వన్డే ప్రపంచకప్ వరకు వన్డేలకు సంబంధించి రోహిత్ శర్మను కొనసాగించే అవకాశాలు ఉన్నాయని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.