Hardik Pandya: టీ20 ప్రపంచ కప్ సెమీస్లో వెనుదిరిగిన టీమిండియా.. ప్రస్తుతం న్యూజిలాండ్తో టీ20, వన్డే సిరీస్లు ఆడుతోంది. తాజాగా జరిగిన టీ20 సిరీస్ను భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-0తో సొంతం చేసుకుంది. అయితే, మూడు మ్యాచ్లలోనూ పూర్తిగా జరిగింది ఒక మ్యాచ్ మాత్రమే. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దయ్యింది. రెండో టీ20లో భారత్ భారీ విక్టరీ సాధించింది. ఇక మూడో మ్యాచ్లోనూ తొలి ఇన్నింగ్స్ అయ్యాక భారత్ ఛేజింగ్ చేస్తున్న క్రమంలో వర్షం అడ్డంకిగా మారింది.
మూడో మ్యాచ్లో డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం వర్షం కురిసే సమయానికి స్కోర్లు సమంగా ఉండటంతో మ్యాచ్ను టైగా ప్రకటించారు అంపైర్లు. దీంతో భారత్ అంతకుముందు రెండో మ్యాచ్ గెలిచింది కాబట్టి 1-0తో సిరీస్ కైవసం చేసుకున్నట్లయింది. ఈ నేపథ్యంలో టీ20 జట్టుకు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్య మాట్లాడిన తీరుపై ఇప్పుడు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
టీ20 జట్టులో భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్, పేసర్ ఉమ్రాన్ మాలిక్లకు చోటు దక్కకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. ఇదే విషయంపై నెటిజన్లు హార్దిక్ పాండ్యను ప్రశ్నించారు. ఇది నా జట్టు.. నా ఇష్టం.. అంటూ సమాధానమిచ్చాడు పాండ్య. బయటి వ్యక్తుల మాటలు తమను ప్రభావం చేయలేవని, కోచ్తో మాట్లాడిన తర్వాతే అత్యుత్తమ ఆటగాళ్లను తీసుకుంటానని కాస్త పొగరుగా స్పందించాడు .
ఈ నేపథ్యంలో నెటిజన్లు పాండ్యపై మండిపడుతున్నారు. పూర్తి స్థాయి కెప్టెన్ కాక ముందే ఇలావ్యవహరిస్తున్నాడంటే ఇక టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ సిరీస్ నెగ్గినంత మాత్రాన విజయవంతమైన కెప్టెన్ అనిపించుకోలేరని గుర్తు చేస్తున్నారు. గతంలో టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని ఎన్ని సిరీస్లు గెలిచినా ఈ తరహా ఆట్యిట్యూడ్ చూపించలేదని చెబుతున్నారు. సీనియర్ ఆటగాళ్లపై నోరు పారేసుకోవడం తగదని హితవు పలుకుతున్నారు.