Ganta: అక్టోపస్ అన్న పేరు వినగానే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. కాగా కేవలం ఆయన మాత్రమే కాకుండా ఆయన బాటలోనే మరొకరు కూడా ప్రయాణిస్తున్నారని చెప్పవచ్చు. ఆయన మరెవరో కాదు విశాఖకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. గంటాని వైజాగ్ అక్టోపస్ గా కూడా పిలుస్తుంటారు. ఏ పార్టీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది అన్న విషయాన్ని ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా మలుచుకుంటారు అంటూ ప్రత్యర్థులు ఆయనపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటారు.
కాగా గంటా నాలుగేళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారా లేరా అన్నట్లుగా అనిపించన ఆయన ఇప్పుడు మాత్రం ఉన్నాను, యాక్టివ్ అయ్యాను అని అంటున్నారు. తాజాగా చంద్రబాబు పుట్టిన రోజున సందర్బంగా గంటా విశాఖ ఆక్టోపస్ గా మారి జోస్యం చెప్పారు. తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో ఏపీకి 2024లో చంద్రబాబు సీఎం కావడం అంతే నిజం అంటూ కుండ బద్దలు కొట్టినట్టు తెలిపారు. చంద్రబాబు పాలనను పాలిచ్చే ఆవుతో పోల్చారు గంటా. 2019లో బాబుని కాదని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారని గంటా ప్రజలనే ఆక్షేపించారు.
వైసీపీ ప్రభుత్వం అవినీతి అక్రమాలలో మొదటి స్థానంలో ఉందని బండలు వేశారు. నాలుగేళ్ళుగా ఏపీకి చేసింది ఏమీ లేదని ఇపుడు పోర్టులు ఎయిర్ పోర్టులు కడతామంటే ఎవరు నమ్మాలి. విశాఖకు రాజధాని అంటే కూడా ఎవరూ నమ్మరని గంటా అంటున్నారు. ఇదే గంటా గతంలో జై విశాఖ రాజధాని అని నినదించిన సంగతిని మరచారు అని ప్రత్యర్ధ్యులు అంటున్నా ఆయన ఇపుడు పక్కా టీడీపీ వాది. ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనకు ఏడాది పైగా సమయం ఉంది. చంద్రబాబు కడప టూర్ లో మాట్లాడుతూ ఏమీ లేదు మొత్తం ప్రభుత్వం టైం అయిపోయింది అని చెప్పారు. ఇపుడు గంటా దాన్ని అనుసరిస్తూ నెలలు లేవు కేవలం రోజులకు వైసీపీ పాలన వచ్చేసింది అని అంటున్నారు. అంటే ఏపీలో మే లో ఎన్నికలు జరుగుతాయని గంటా భావిస్తున్నారా అని వైసీపీ నేతలు అడుగుతున్నారు.