KL Rahul: టీమిండియా ఖాతాలో మరో వన్డే సిరీస్ చేరింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో 215 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని మరో 6 ఓవర్లు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి భారత్ ఛేదించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. కీలక వికెట్లు కోల్పోయిన దశలో కేఎల్ రాహుల్ (64) హాఫ్ సెంచరీ చేసి భారత్ను ఆదుకున్నాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా శ్రీలంక బ్యాటింగ్ చేసింది. అయితే ఆ జట్టు పూర్తి ఓవర్లు కూడా ఆడకుండానే ఆలౌటైంది. 39.4 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలింది. అరంగేట్ర ప్లేయర్ నువనిందు ఫెర్నాండో(50) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లు సాధించాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 43.2 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (17), శుభ్మన్ గిల్ (21) విఫలమయ్యారు. తొలి వన్డే సెంచరీ హీరో విరాట్ కోహ్లీ (4) పేలవంగా అవుటయ్యాడు. అయ్యర్ (28) కూడా ఎక్కవసేపు నిలబడలేదు. అయితే కేఎల్ రాహుల్కు అండగా హార్దిక్ పాండ్యా(53 బంతుల్లో 4 ఫోర్లతో 36) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక బౌలర్లలో కరుణరత్నే, లాహిరు కుమార రెండేసి వికెట్లు తీశారు. కసున్ రజిత, ధనంజయ డిసిల్వా తలో వికెట్ పడగొట్టారు.
నెమ్మదిగా ఆడి గెలిపించిన కేఎల్ రాహుల్
ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఆపద్భాందవుడి పాత్రను పోషించాడు. కీలక వికెట్లు పడటంతో నెమ్మదిగా ఆడి జట్టును విజయలక్ష్యం వైపు నడిపించాడు. మరో వికెట్ పడి ఉంటే ఈ మ్యాచ్లో ఫలితం మరోలా ఉండేది. కానీ అలాంటి తప్పులకు అవకాశం ఇవ్వకుండా పాండ్యాతో కలిసి రాహుల్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. పాండ్యా అవుటైనా అక్షర్ పటేల్(21), కుల్దీప్ యాదవ్(10) సాయంతో తుది లక్ష్యాన్ని ఛేదించాడు.