Chandrababu: ప్రస్తుతం ఏపీలో 50 శాతం మంది ప్రజలు వచ్చే ఏడాది చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని కోరుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే టిడిపి యువనేత నారా లోకేష్ మొదలుపెట్టిన యువగలం పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు చావు దెబ్బ తగలనుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. మోడీ సర్కార్కు భయపడి ఆంధ్రప్రదేశ్లో ముస్లింల రిజర్వేషన్ ఎత్తి వేయడానికి కూడా వెనుకాడరు అన్న అభిప్రాయం బలపడుతోంది.
తాజాగా ఒక జాతీయ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ విధానాలకు మద్దతు పలకడమే ముస్లింలకు రిజర్వేషన్ ఎత్తివేస్తారనేందుకు నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు. ఇదే వార్త ప్రస్తుతం ఏపీలో సంచలనంగా మారింది. ప్రధాని నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను, అమలు చేస్తున్న విధానాలను నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. ప్రధాని ప్రతిపాదిస్తున్న విజన్ 2047తో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో చేరేందుకు వ్యతిరేకం కాదు కదా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది నిర్ణయిస్తుంది అని తెలిపారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏపీలో అధికారంలోకి వస్తే తమ రిజర్వేషన్ ఎత్తివేయడానికి సిద్ధపడతారనే చర్చ మొదలైంది.
ఇటీవల తెలంగాణ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ముస్లింల రిజర్వేషన్ పై సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో ఎన్డీఏలో చేరాలని చంద్రబాబు ఉత్సాహం చూపుతున్నారని ఆయన దాటవేత ధోరణి మాటలే చెబుతున్నాయి. ముఖ్యంగా బాబు ఈ ఛానల్ ఇంటర్వ్యూలో మోడీ విధానాలను పూర్తిగా సమర్థిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు అనుకూలమని, అలాగే కర్నాటలో ఇప్పటికే బీజేపీ సర్కార్ ముస్లింల రిజర్వేషన్ను రద్దు చేసినట్టు, ఏపీలో కూడా అలాంటి నిర్ణయాన్నే తీసుకుంటాననే సంకేతాల్ని టీడీపీ అధినేత పంపారనే అభిప్రాయాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో రాజకీయంగా ముస్లింలు వైఎస్సార్ తనయుడికి అండగా ఉన్నారని, తనకు పెద్దగా ఉపయోగం లేదనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.