Congress: తాజాగా కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాయిన్ అయిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ చేతుల మీదుగా పొంగులేటి కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. 1300 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కను ఈ సందర్బంగా రాహుల్ గాంధీ అభినందించారు. ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగం ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పింఛన్ పథకానికి సంబంధించి ప్రకటన చేశారు.
తెలంగాణలో తమకు అధికారం ఇస్తే, ఒక్కసారి అవకాశం ఇస్తే చేయూత పేరుతో వితంతువులు, వృద్ధులకు నెలకు రూ.4 వేలు చొప్పున పింఛన్ అందజేస్తామని రాహుల్ గాంధీ ఈ సందర్బంగా హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ బంధుత్వ పార్టీగా ఆయన సెటైర్ విసిరారు. తెలంగాణ లోనూ కర్నాటక ఫలితాలే వస్తాయని అన్నారు రాహుల్. కర్నాటకలో అవినీతి ప్రభుత్వాన్ని పారదోలామన్నారు పిలుపునిచ్చారు.
తెలంగాణలో బీజేపీ ఖతం అయ్యిందని ఆయన అన్నారు. అలాగే రానున్న రోజుల్లో బీజేపీ బీ టీమ్ బీఆర్ఎస్ తోనే తమ పోటీ అని రాహుల్ ప్రకటించారు.
కర్నాటకలో మాదిరిగా తెలంగాణలో బీజేపీ బీ టీమ్ను ఓడిస్తామని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఐడియాలజీ దేశాన్ని కలపడం అని ఆయన అన్నారు. కానీ ఇతరుల ఐడియాలజీ దేశాన్ని విడదీయడమని బీజేపీకి చురకలు అంటించారు. ఇదిలా ఉంటే తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణలో సానుకూల వాతావరణం ఏర్పడడంతో కాంగ్రెస్ లోకి వలసలు మొదలయ్యాయి. సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.