YS Sharmila: పీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు తీసుకున్నప్పుడు.. చంద్రబాబు, జగన్, పవన్ కూడా వార్తల్లో కనిపించేవారు. టీడీపీ, జనసేన కూడా చేయని విధంగా ఆమె జగన్ పై మాటల దాడి చేసేవారు. వైసీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేశారు. అయితే రాను రాను ఆమె ఎన్నికల ప్రచారానికి కవరేజ్ తగ్గిపోయింది. దానికి కారణం ఆమె ప్రసంగంలో కొత్తదనం లేదు. ఉపయోగపడని ప్రసంగమే ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకహోదా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే పేర్లే ఎక్కువగా ఆమె ప్రసంగంలో ఉంటాయి. వీటిని వినివిని ప్రజలకు బోర్ కొట్టింది. ఎందుకంటే.. ప్రత్యేకహోద అంశం అసలు అమలుకాదు. అది ముగిసిన అధ్యాయనం ప్రజలు కూడా దాని గురించి పట్టించుకోవడం లేదు. అలాంటి అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ప్రయోగిస్తే మరోసారి ప్రజలను మోసం చేయడమే అవుతోంది. ఓసారి బీజేపీ, మరోసారి వైసీపీ ఈ ప్రత్యేకహోదా అంశాన్నే అస్త్రంగా చేసుకొని ఏపీ ప్రజలను మోసం చేశాయి. ఇప్పుడు మూడోసారి మోసపోవడాని ప్రజలు సిద్దంగా లేరు. అయితే, షర్మిల మాత్రం ప్రత్యేకహోదాను తీసుకొని వస్తానని అంటున్నారు. మరి నిజంగా అది అమలయ్యే అంశమేనా అంటే అనుమానమే. రాహుల్ గాంధీ ప్రధాని అయితే.. ప్రత్యేకహోదా వస్తుందని ఆమె చెబుతున్నారు. అసలు రాహుల్ ప్రధాని అవుతారా? అని ఆలోచించాలి. కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అందుకే.. మిత్రపక్షాలతో కలిసి ఇండియా కూటమిని కట్టారు. కానీ..ఈ కూటమి పార్టీలు తలో దారిలో ఉన్నాయి. సీట్ల పంచాయితీ ఇంకా కొలిక్కిరాలేదు. సింగిల్ గా పోటీ చేయడానికి మమత బెనర్జీ సిద్దమయ్యారు. ఇవాలో, రేపో అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేస్తారు.
ఆప్తో కాంగ్రెస్ కు పాక్షికంగానే పొత్తు కుదిరింది. కాంగ్రెస్ బలంగా ఉన్న దగ్గరే పొత్తు కుదిరింది. ఆప్ బలంగా ఉన్న పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి. కూటమిని ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చి ఎన్డీఏలో చేరిపోయారు. మహారాష్ట్రలోని పార్టీల మధ్య సీట్ల సర్థుబాటు తేలలేదు. ఇన్ని సమస్యలను దాటుకొని ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా? ఒకవేళ అన్ని కుదిరి ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినా.. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా? ఇప్పటికే ప్రధాని అభ్యర్థిగా మల్లకార్జున్ ఖర్గేను ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే.. కూటమిలోని చాలా పార్టీలు అడ్డుకుంటాయి. ఏపీకి పక్కనే ఉన్న కర్నాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి సహకరిస్తాయో లేదో చెప్పలేం. మరీ ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని అడ్డుకోవచ్చు. ఎందుకంటే ఏపీకి హోదా వస్తే.. చెన్నై నుంచి కంపెనీలు తరలిపోతాయని భయం. ఇన్ని సమస్యలు ఉండగా.. వైఎస్ షర్మిల.. చాలా ఈజీగా ఏపీకి ప్రత్యేకహోదా తీసుకొని వస్తామని ప్రకటిస్తున్నారు. ఇది ప్రజలను మరోసారి మోసం చేయడమే అవుతుంది. అలా అమలుకు సాధ్యంకాని ప్రకటనలతో ప్రసంగాలు బోర్ కొట్టిస్తాయి.
ప్రత్యేకహోదాతో పాటు .. వైఎస్ఆర్ బిడ్డను అంటూ ప్రసంగం మొత్తం రక్తికట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, మొదట్లో ఇది బాగనే ఉన్నా.. రోజు వినడానికి చిరాకుగా ఉంటుంది. ఎందుకంటే.. తనకు ఓటేస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పాలి. అది మానేసి వైఎస్సార్ బిడ్డను అని చెప్పుకుంటూ పోతే.. జనం ఆధరిస్తారనుకోవడం మూర్ఖత్వం అవుతోంది.