Women: భారతీయ సంప్రదాయంలో పసుపుకి విశేష ప్రాధాన్యత ఉంది. భారతీయులు సుమారుగా కొన్ని వేల సంవత్సరాలుగా పసుపుని పూజ సామాగ్రిగా ఇంకా కొన్ని విధాలుగా వాడుతున్నారు. ఆడవాళ్లు తప్పనిసరిగా కాళ్ళకి పసుపు రాసుకొని పూజలు, వ్రతాలు చేయాలి అనేది ఏనాటి నుంచో వస్తున్న ఆచారం. ఒకప్పుడు కాళ్ళకి పసుపు రాసుకోకుండా తలకి స్నానం చేసేవారు కాదు. అలాగే నుదుటికి పసుపు రాసుకొని అప్పుడు కుంకుమ అద్దుకునేవారు.
అలాగే పూజలలో పసుపు కుంకుమలకి ప్రత్యేకమైన విశిష్టత, పవిత్రత ఉన్నాయి. పసుపుకి ఉన్న విశిష్టమైన గుణం ఏమిటంటే.. ఇది ఆహారంలో వాడుకుంటాం ఔషధాలలో వాడుకుంటాం. అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ఉపయోగకరమైనది. గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టడం వల్ల లక్ష్మీదేవి నిత్యం మన ఇంట్లోనే ఉంటుంది అని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. అంతటి ప్రాధాన్యత ఉన్న పసుపుని కాళ్ళకి రాసుకొని పూజ చేయడం అనేది ఎంతో పవిత్రమైన కార్యం.
అలాగే పేరంటం ఇచ్చేటప్పుడు కూడా ఆడవాళ్ళ కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి అప్పుడు చేతిలో పేరంటం పెడతాము. అలా కాళ్ళకి రాసేటప్పుడు పాటించవలసిన విధానం గురించి మీకు తెలుసా.. ఎలా పడితే అలా కాళ్ళకి పసుపు రాస్తే లక్ష్మీదేవి రావటం పక్కన పెడితే జేస్టాదేవి మాత్రం కచ్చితంగా వస్తుందట. చక్కగా ఒక శుభ్రమైన గిన్నెలో పసుపుని తీసుకొని అందులో పవిత్రమైన నీరు అంటే ఎవరూ ఎంగిలి చేయని నీరు కలిపి మధ్య మూడు వేళ్ళతో కలిపి కాళ్ళకి పసుపు రాయాలి.
అలాగే ముత్తయిదువులకి రాసేటప్పుడు కూడా పైన చెప్పిన విధంగా కాళ్ళకి పసుపు రాయాలి. అలా కాకుండా చేతిలోకి పసుపు తీసుకొని అందులో ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు కలిపి అలాగే ఆ పసుపు ముద్దని కాళ్ళకి రాయటం వలన పసుపుని అవమానించినట్లు అవుతుంది లక్ష్మీదేవిని కూడా అవమానించినట్లు అవుతుంది. కాబట్టి పసుపుని కాళ్ళకి ధరించేటప్పుడు భక్తి శ్రద్దలతో పద్ధతిగా ధరించండి. లక్ష్మీదేవి అనుగ్రహానికి పసుపు రాసుకోవడం కూడా ఒక ఆచారం అని తెలుసుకోండి.