Nalgonda: విద్యార్థి దశ నుంచే చాలా మంది కలలు కంటారు. వాటిని నిజం చేసుకునేందుకు కృషి చేస్తుంటారు. కానీ కొందరు వాటిని సాకారం చేసుకునే క్రమంలో సాకులు చూపిస్తూ తప్పించుకుంటారు. ఇప్పుడు చెప్పబోయే అమ్మాయి మాత్రం అలా కాదు. పట్టుపట్టరాదు… పట్టివదలరాదు అనేలా చేసింది. ఒకవైపు తన కుటుంబ విషాదాన్ని దాచుకుంటూనే తన కలల్ని సాకారం చేసుకుంటోంది.
సమాజంలో ఎవరి విజయగాధలను చూసినా, ఎంతో కష్టపడి పైకి వచ్చిన వారే. జీవితంలో ఒడిదుడుకులు సహజం. వాటిని అధికమించాలి. జీవితం అనుకున్నట్లుగా సాగదు. అప్పడప్పుడు ఎత్తుపల్లాలు వస్తుంటాయి. అందుకోసం అలుపెరగని యుద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే చాలా మందికి కోరుకున్నది సాధించడానికి పెద్ద ఇబ్బందులు ఉండవు. కానీ వారు విజయాన్ని వాయిదా వేసేందుకు ఎక్కడలేని కారణాలను చెబుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పే అమ్మాయి జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇంకొకరైతే వాటికి భయపడి లక్ష్యాన్ని విరమించుకుంటారు. కానీ అలా అమ్మాయి చేయలేదు.
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొత్తలాపురానికి చెందిన వెంకటయ్య, లక్ష్మమ్మ దంపతుల కుమార్తే అలేఖ్య. తల్లికి అనారోగ్యం అని తెలియగానే కన్నతండ్రి వీరిని వదిలి వెళ్లిపోయాడు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అలేఖ్యను తీసుకుని లక్ష్మమ్మ పుట్టింటికి వచ్చేసింది. తల్లికి భారం కాకుండా అలేఖ్య ఆరో తరగతి నుంచే నిడమానూరు వసతిగృహంలో ఉంటూ చదువుకుంది. ఆమె పదో తరగతికి వచ్చేసరికి తల్లి ఆరోగ్యం క్షీణించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.
తండ్రి దూరం కావటం ఒక సమస్య అయితే, తల్లిని కోల్పోవటం మరో పెద్ద సమస్య. కానీ అలేఖ్య మాత్రం కొండంత బాధను గుండెల్లోనే దాచుకుంది. ఎంతో కష్టపడి ఏప్రిల్ నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షలు రాసింది. 9.7 జీపీఏతో పరీక్షల్లో తన సత్తా చాటింది.