T20: శ్రీలంకతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. ఈరోజు రాజ్కోట్ వేదికగా మూడో టీ20 జరగనుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందులో ఎవరు గెలిస్తే వాళ్లే సిరీస్ చేజిక్కించుకుంటారు. తొలి టీ20లో భారత్ గెలవగా రెండో టీ20లో శ్రీలంక విజయం సాధించింది. రెండో టీ20లో టీమిండియా పోరాడి ఓడిపోయింది. దీంతో మూడో టీ20లో హార్దిక్ పాండ్యా సేన ఎలా ఆడుతుందో అన్న విషయం ఆసక్తికరంగా మారింది.
ఈ సిరీస్లో యువ ఆటగాళ్లు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. ఓపెనర్ శుభ్మన్ గిల్ రెండు మ్యాచ్లలోనూ తేలిపోయాడు. రాహుల్ త్రిపాఠి కూడా ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేదు. ముఖ్యంగా రెండో టీ20లో బౌలర్ల ప్రదర్శన దారుణంగా ఉంది. అర్ష్దీప్ సింగ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలి టీ20లో ఆకట్టుకున్న శివం మావి రెండో మ్యాచ్లో రాణించలేకపోయాడు. ఉమ్రాన్ మాలిక్ వికెట్లు తీస్తున్నా పరుగులు కట్టడి చేయడం లేదు.
టీమిండియా బ్యాటింగ్ లైనప్లో కూడా కొన్ని కీలక మార్పులు చేయడం ద్వారా మూడో మ్యాచ్లో భారత్ గెలిచే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిడిలార్డర్లో ముందుగా హార్దిక్ పాండ్యా దిగుతున్నాడు. అతడు తన స్థానాన్ని మార్చుకుని, స్పిన్ బౌలర్లపై ఎదురు దాడి చేయగలిగే దీపక్ హుడా వంటి వాళ్లను ముందుగా బ్యాటింగ్కు పంపితే బాగుంటుందని సూచిస్తున్నారు.
బ్యాటింగ్ పిచ్పై టీమిండియా రాణించేనా?
రాజ్కోట్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుందని క్యూరేటర్లు చెప్తున్నారు. దీంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ కాకుండా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉందని వివరిస్తున్నారు. గత మ్యాచ్లో టాస్ గెలిచి తప్పు చేసిన పాండ్యా ఈ మ్యాచ్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి. ఈ మ్యాచ్లో బౌలర్లను హార్దిక్ తెలివిగా ఉపయోగించుకోవాల్సి ఉంది. పవర్ప్లేలో అద్భుతంగా రాణిస్తున్న పాండ్యా డెత్ బౌలింగ్ భారాన్ని కూడా భుజాలకు ఎత్తుకుంటే బాగుంటుంది.