T20: రాజ్కోట్ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా అదరగొట్టింది. సిరీస్ గెలవాలంటే తప్పక రాణించాల్సిన మ్యాచ్లో భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ గత టీ20లో చేసిన తప్పును పునరావృతం చేయకుండా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ విఫలమైనా శుభమన్ గిల్ (46), రాహుల్ త్రిపాఠి (35) రాణించారు.
టీమిండియా భారీ స్కోరు చేసిందంటే కారణం సూపర్ ఫామ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్. ఇప్పటికే ఐసీసీ టీ20 ర్యాంకుల్లో నంబర్వన్గా ఉన్న అతడు ఈ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఏకంగా సెంచరీతో శ్రీలంక బౌలర్లను ఉతికి ఆరేశాడు. 45 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. సూర్యకుమార్ ఈ మ్యాచ్లో 51 బంతుల్లో 112 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
కెప్టెన్ హార్దిక్ పాండ్యా (4), దీపక్ హుడా విఫలమైనా సూర్యకుమార్కు అక్షర్ పటేల్ (21 నాటౌట్) తన వంతు సహకారం అందించడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. తనకే సాధ్యమైన షాట్లతో సూర్యకుమార్ విరుచుకుపడటంతో శ్రీలంక ఫీల్డర్లు నివ్వెరపోయారు. కెప్టెన్ డసన్ షనక ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సూర్య మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అతడు తర్వాత మరో 19 బంతుల్లోనే 50 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
మూడో టీ20లో సమిష్టిగా రాణించిన బౌలర్లు
రెండో టీ20లో దారుణంగా విఫలమైన టీమిండియా బౌలర్లు నిర్ణయాత్మక మూడో టీ20లో మాత్రం సమిష్టిగా రాణించారు. 229 పరుగుల లక్ష్యచేధనలో శ్రీలంక 16.4 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ డసన్ షనక(23), కుశాల్ మెండిస్(23) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్, చాహల్ తలో రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో భారత్ మూడు టీ20ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సూర్యకుమార్ గెలుచుకోగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా అక్షర్ పటేల్ నిలిచాడు.